భీంపూర్, డిసెంబర్ 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపట్టిన పల్లెప్రకృతివనాలు గ్రామాలకు వన్నె తెస్తున్నాయి. మండలంలోని 26 పంచాయతీలు, అనుబంధ గ్రామాల్లో మొత్తంగా 45 పల్లె ప్రకృతివనాలు ఉన్నా యి. ఇక కరంజి(టీ) గ్రామంలో పదెకరాల స్థలంలో బృహ త్ ప్రకృతి వనం ఏర్పాటుచేశారు. కరంజి(టీ) జీపీ అనుబంధ గ్రామం గుట్టమీద ఉన్న రాజులవాడిలో కూడా బృహత్వనం ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు మరో మూడు ఆవాసాల్లో బృహత్వనాలకు స్థల పరిశీలన చేస్తున్నారు. ఏడో విడత హరితహారంలో 5 లక్షల మొక్కలు రోడ్ల పక్కన (ఎవెన్యూ ప్లాంటేషన్), చేల గట్లపై నాటగా వాటిని సంరక్షిస్తున్నారు. ఈ మొక్కల సంఖ్య పల్లె ప్రకృతి వనాలు, బృహత్వనాల్లోని మొక్కల సంఖ్యకు అదనం. ఉపాధిహామీ నిధులతో నిర్వహిస్తున్న ఈ వనాల సంరక్షణ బాధ్యత స్థానిక సర్పంచ్లు, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందిదే. ఈ వనాల చుట్టూ కాంపౌండ్వాల్, ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
మెగా పార్కులకు శ్రీకారం..
మండలంలోని పల్లెప్రకృతివనాలతో మంచి ఫలితాలు రావడంతో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. బృహత్వనాలపై దృష్టి సారించింది. ప్రభుత్వం మొదటి దశలో మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి రూ.46 లక్షల అంచ నా వ్యయంతో బృహత్ వనం ఏర్పాటు చేసింది. కరంజి (టీ)లో చిట్టడవికి దగ్గరగా గుట్టపై పదెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మెగా పార్కు ఆదర్శంగా నిలుస్తున్నది.
మరిన్ని బృహత్వనాలకు స్థల పరిశీలన
పల్లె ప్రకృతినాల్లోని ప్రతీ మొక్కసంరక్షణకు శ్రద్ధ తీసుకుంటున్నాం. మొదటి దశలో కరంజి(టీ)లో బృహ త్ ప్రకృతివనం ఏర్పాటు చేశాం. ఇది తుదిదశలో ఉన్నది. ఇదే పంచాయతీ పరిధిలోని రాజులవాడి గిరిజన గ్రామంలో కూడా బృహత్వనం ఏర్పాటు చేస్తున్నాం. మరో నాలుగు బృహత్వనాలకు అవసరమైన స్థలాలను పరిశీలిస్తున్నాం. ఈజీఎస్ , పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఫలితాలు రాబడుతున్నాం. గ్రామాల్లో ఆహ్లాదమైన వాతావరణానికి ఈ వనాలు తోడ్పడుతున్నాయి.
శ్రీనివాస్, ఎంపీడీవో ,భీంపూర్