పేదల వైద్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అత్యాధునిక వసతులతో కొత్త భవనాలను నిర్మించనున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు పీహెచ్సీల కోసం నిధులు మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.1.56 కోట్ల చొప్పున మొత్తం రూ.10. 92 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన భవనాలను కార్పొరేట్ స్థాయిలో అన్ని రకాల సౌకర్యాలతో తీర్చిదిద్దనుండగా, పేదలకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయి.
ఆదిలాబాద్, సెప్టెంబర్ 23 ( నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలంటే ప్రజలు భయపడేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం సర్కారు వైద్యానికి పెద్దపీట వేసింది. అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన చికిత్సలు అందిస్తున్నది. దీంతో సర్కారు దవాఖానల్లోకి వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. పలు రకాల ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్న వారు ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స పొంది వ్యాధులను నయం చేసుకుంటున్నారు. గతంలో కార్పొరేట్ వైద్యశాలలకు పరిమితమైన వైద్యం ఇప్పుడు సర్కారు దవాఖానల్లో ఉచితంగా అందుబాటులోకొచ్చాయి. ఆదిలాబాద్ జిల్లాలో గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, డయేరియా లాంటి వ్యాధులతో బాధపడేవారు. గ్రామాలకు గ్రామాలే మంచం పట్టేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వైద్యశిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. గర్భిణులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తూ తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దవాఖానల్లో పరిశుభ్రతకు సైతం ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసి 57 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నది. ఆదిలాబాద్ రిమ్స్లో మోకాలు శస్త్రచికిత్సలు సైతం వైద్యులు విజయవంతంగా నిర్వహించారు.
ఎన్నో ఏళ్ల కిందట నిర్మించిన పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు శిథిలావస్థకు చేరడంతో ప్రభుత్వం కొత్త వాటిని మంజూరు చేసింది. ఆదిలాబాద్ జిల్లాలోని బేల, తలమడుగు, నిర్మల్ జిల్లాలోని పెంబి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఈజ్గావ్, వాంకిడి, దహెగాం, మంచిర్యాల జిల్లాలోని కుందారం పీహెచ్సీలకు కొత్త భవనాలు మంజూరయ్యాయి. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.1.56 కోట్ల చొప్పున రూ.10.92 కోట్లు విడుదలయ్యాయి. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో వీటి నిర్మాణాలు చేపట్టనున్నారు. వైద్యం కోసం వచ్చే వారి కోసం 30 పడకలను ఏర్పాటు చేస్తారు. ఆపరేషన్, ల్యాబ్, మందులు, ఇతర సౌకర్యాలు ఉండేలా వీటిని నిర్మిస్తారు. రోగుల బంధువులు ఉండేలా, వైద్యం కోసం వచ్చే వారు ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు కల్పిస్తారు. వైద్యులు, సిబ్బంది కోసం ప్రత్యేక గదులు నిర్మిస్తారు. ప్రభుత్వం పీహెచ్సీలకు కొత్త భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయ డంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.