ఊరూవాడా ‘జన గణ మన’ జాతీయ గీతంతో మార్మోగింది. మువ్వన్నెల జెండాలతో పల్లె పట్నంలో పండుగ వాతావరణం నెలకొంది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మంగళవారం సబ్బండ వర్గాలు ఎక్కడివారు అక్కడే నిలబడి సామూహిక గీతాలాపన చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, యువకులు పాల్గొని.. శాంతికపోతాలు, త్రివర్ణ బెలూన్లు గాలిలో ఎగురవేశారు. జాతీయ జెండాలు చేత బూని ర్యాలీలు నిర్వహించారు. నిర్మల్ జిల్లాకేంద్రంలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ.. కుభీర్లో ఎమ్మెల్యే విఠల్రెడ్డి.. ఖానాపూర్లో ఎమ్మెల్యే రేఖానాయక్.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి.. బోథ్లో ఎమ్మెల్యే బాపురావు పాల్గొన్నారు. కాగా.. ఖానాపూర్ మండలంలోని మేడంపల్లిలో మహిళలు వరినాట్లు వేస్తూ జాతీయగీతాన్ని ఆలపించారు.
నిర్మల్(నమస్తే తెలంగాణ)/ఎదులాపురం, ఆగస్టు 16 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లావ్యాప్తంగా జాతీయ గీతాలాపన మార్మోగింది. ఊరూ వాడా జాతీయ గీతంతో హోరెత్తింది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మంగళవారం ఉదయం 11.30 గంటలకు జిల్లా, మండల కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లలో జాతీయ జెండాలకు సెల్యూట్ చేస్తూ సామూహికంగా జన గణ మన గీతాలాపన చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి జాతీయ జెండాలు చేతబూని భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడే ఉదయం 11.30 గంటలకు నిర్వహించిన జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రితోపాటు జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్కుమార్, అడిషనల్ కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు పాల్గొన్నారు. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో చించోలి చౌరస్తా వద్ద జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయ సిబ్బందితోపాటు పాఠశాలల విద్యార్థులు మానవహారంగా ఏర్పడి జాతీయ గీతాన్ని ఆలపించారు. బాసర అమ్మవారి సన్నిధిలో కూడా భక్తులు, అర్చకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కుభీర్ మండల కేంద్రంలోని వివేకానంద చౌక్లో నిర్వహించిన కార్యక్రమానికి ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి హాజరయ్యారు. విద్యార్థులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జాతీయ గీతాలాపన చేశారు. కడెం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పాల్గొన్నారు. విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని తెలంగాణ తల్లి చౌక్లో జాతీయ గీతాలాపన చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్, తెలంగాణ చౌక్లో ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, ఏఎస్పీ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ ప్రేమేందర్, మున్సిపల్ కమిషనర్ శైలజ, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ విద్యార్థులతో కలిసి జాతీయ జెండా రంగులు గల బెలూన్స్ను వదిలారు. ఐటీడీఏ ఉద్యోగులతో కలిసి కార్యాలయ ఆవరణలో ఏడీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కెరావు సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. కేబీ కాంప్లెక్స్ గ్రౌండ్లో ఏఎస్పీ హర్షవర్ధన్ శ్రీవాస్తవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బోథ్ మండల కేంద్రంలో యువతీ యువకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ సామూహిక గీతాన్ని ఆలపించారు. కొన్ని చోట్ల శాంతి కపోతాలు, త్రివర్ణ బెలూన్లను గాలిలోకి వదిలారు.