ఆదిలాబాద్,(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నిర్మల్ టౌన్, ఆగస్టు 10: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఉద్యోగులు, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటుపరం చేస్తుండడంతో, ఎన్నో ఏళ్లుగా వాటిల్లో పనిచేస్తున్న ఉద్యోగులు జీవనోపాధి కోల్పోతున్నారు. దీంతో ఆయా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా సంస్థలపై ఆధాపడి ఉపాధి పొందుతున్న వారు కూడా తీవ్రంగా నష్ట పోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ప్రజలు కూడా నష్టపోవాల్సి వస్తున్నది. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీతో పాటు పలు ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వైపు అడుగులేయిస్తున్న కేంద్ర ప్రభుత్వం, మరోవైపు విద్యుత్శాఖను కూడా అస్మదీయులకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నది. దీంతో పాటు ప్రజలకు ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న తపాలా శాఖ ను కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు రంగం సి ద్ధం చేసింది. కేంద్రం తీసుకుంటున్న చర్యలతో తపాలాశాఖ లో పనిచేస్తున్న సుమారు 5 లక్షల మంది ఉద్యోగుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనుంది.
ఉద్యోగుల ఆందోళనబాట..
కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా బుధవారం పోస్టల్ ఉద్యోగులు ఆందోళనలు చేపట్టా రు. ఆయా జిల్లా కేంద్రాల్లోని తపాలా కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ఉత్తరాల బట్వాడ, సేకరణ, జీవిత బీమా, పా ర్సిల్ సేవలు, వ్యాపారాభివృద్ధి, కోర్ బ్యాంకింగ్ సేవలను ముక్కలుగా విడగొట్టి పెట్టుబడిదారులకు అప్పజెప్పే ప్రయ త్నం చేస్తున్నదని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ పేరిట బ్యాంకింగ్ రం గంలోకి తపాలా శాఖను తెస్తున్నామని చెబుతూ, సంస్కరణలంటూ మభ్యపెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50 కోట్ల వినియోదారుల సేవింగ్స్ ఖాతాల్లో దాచుకున్న రూ.10 లక్షల కోట్లను ఎలాంటి అనుభవం లేని ఉద్యోగుల తో నడుస్తున్న ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకుకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నదని మండిపడుతున్నారు. కేంద్రం తన విధానాలను మార్చుకొని ఉద్యోగులు, వినియోగదారులకు మెరుగైన సేవలు అఁదేలా చూడాలన్నారు. ఆదిలాబాద్లో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగు రామన్న హాజరై మద్దతు పలికారు. ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఉద్యోగుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.
ఆందోళనలు తీవ్రం చేస్తాం
పోస్టల్ శాఖను ప్రైవేటు పరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. పోస్టల్ ఉద్యోగులు గ్రామాల్లో ప్రజలకు అన్ని రకాల సేవలు అందిస్తున్నారు. మోదీ ప్రభుత్వం చర్యల కారణంగా ఉద్యోగులు, ప్రజలు నష్టపోతారు. పోస్టల్ శాఖను ప్రైవేటు పరం చేసే కేంద్ర ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటాం. కేంద్రం తన ప్రయత్నాలను మానుకునేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తాం. భవిష్యత్లో మరింత తీవ్రం చేస్తాం. – జమీల్, అసిస్టెంట్ డివిజనల్ సెక్రటరీ, ఎన్ఎఫ్పీఈ
కరోనా సమయంలోనూ సేవలందించాం.
తపాలా శాఖ సేవలపై ప్రజల్లో ఎంతో నమ్మకం ఉంది. కేంద్ర ప్రభుత్వం పోస్టల్ డిపార్ట్మెంట్ను ప్రైవేటు పరం చేస్తే ఈ నమ్మకం పోతుంది. కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా పోస్టల్ ఉద్యోగులు సేవలందించారు. మందులు, సీఎం కేసీఆర్ అందించిన రూ.1500 ప్రజలకు అందజేశాం. కేంద్రం తీసుకుంటున్న చర్యల వల్ల ఇలాంటి సేవలకు బ్రేక్ పడుతుంది. ప్రజలకు మంచి సేవలు అందించాల్సిన బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగడం బాధాకరం.
– ఆరె మహేందర్, పోస్ట్మెన్ జిల్లా అధ్యక్షుడు, ఎన్ఎఫ్పీఈ
ప్రైవేటీకరణ ఆపాలి..
కేంద్ర ప్రభుత్వం పోస్టల్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నది. తపాలా శాఖను ప్రైవేటీకరిస్తే వినియోగదారులపై తీవ్ర భారం పడుతుంది. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువై పోస్టాఫీసుల సంఖ్య తగ్గిపోయి, కార్పొరేట్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రావడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతాయి.
– పీ రాము. పోస్టల్ జేఏసీ నాయకులు
సంఘాలను నిర్వీర్యం చేస్తోంది..
పోస్టల్ శాఖలో ఉద్యోగుల సమస్యల కోసం అనేక సంఘాలు అవసరం వచ్చినప్పుడు డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా పోరాడే హక్కు ఉంది. ఉద్యోగ సంఘాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్రలో భాగంగానే ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నది. భవిష్యత్లో వినియోగదారులు పోస్టల్ సేవలు వినియోగించుకోవాలంటే కార్పొరేట్ సంస్థలకు అధిక రేట్లు చెల్లించాల్సి వస్తుంది.
– గంగాధర్, జేఏసీ నాయకులు
కేంద్రం వైఖరి మార్చుకోవాలి
ఎన్నో ఏళ్లుగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న పోస్టల్శాఖను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం ప్రభుత్వం పావులు కదుపుతున్నది. తపాలశాఖ సేవలను ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకుకు అప్పగించాలని యోచిస్తున్నది ప్రస్తుతం తపాలాశాఖలో డబ్బులు డిపాజిట్ చేస్తున్న వారికి 4 శాతం వడ్డీ అందుతుంది. ఐపీపీబీకి ఖాతాదారుల డిపాజిట్లు మళ్లిస్తే కేవలం 2 శాతం వడ్డీ మాత్రమే వస్తుంది. దీంతో పోస్టల్ శాఖను ఎన్నో ఏళ్లు నుంచి నమ్ముకున్న వారు నష్టపోతారు. ఎవరూ తపాలశాఖలో డబ్బులు జమ చేయరు. కేంద్రం తన వైఖరిని మార్చుకొని ప్రజలకు నష్టం జరగుకుండా చూడాలి.
– సాయికృపాకర్రెడ్డి, డివిజన్ కార్యదర్శి, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్
కార్పొరేట్ సంస్థలకు అప్పగించొద్దు..
ప్రభుత్వ రంగం సంస్థల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం శోచనీయం. ఎన్నో ఏళ్లుగా ప్రజలకు మంచి సేవలు అందిస్తున్న సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నది. ప్రైవేటీకరణతో ఉద్యోగులకు రోడ్డున పడుతారు. మోదీ ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ప్రజలు ఎంతో కష్టపడి పోస్టాఫీసుల్లో దాచుకున్న డబ్బులను ప్రైవేటు బ్యాంకులకు అప్పగిస్తే వినియోగదారులు ఆందోళన చెందుతారు. ప్రైవేటు సంస్థలు ప్రజల నుంచి వివిధ రకాల ఛార్జీలు వసూలు చేస్తాయి. పోస్టల్ సేవలు ఇప్పటికే ప్రజల మన్ననలు పొందాయి.
– మహేశ్ రెడ్డి, రాష్ట్ర సహ కార్యదర్శి, ఎన్ఎఫ్పీఈ