ఆదిలాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బుధవారం రెండో రోజూ ఘనంగా నిర్వహించారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, స్థానికులు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. పట్టణాలు, పల్లెల్లో ఫ్రీడమ్ పార్కులు ఏర్పాటు చేశారు. నిర్మల్ గండిరామన్న హరితవనంలో రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ మొక్కలు నాటారు.
ఆదిలాబాద్ గాంధీపార్కులో స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న , ఫ్రీడం పార్కును ప్రారంభించి మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు వివిధ శాఖల అధికారులు మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారత స్వాతంత్య్ర స్ఫూర్తిని ప్రజల్లో నింపడానికి , అమరవీరుల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నదని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర వజ్రోత్సవాల్లో అందరూ పాల్గొనాలని ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. ఆదిలాబాద్ జిల్లా మావల గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్కును కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించి మొక్కలు నాటారు. తాంసి మండల కేంద్రంలో ఫ్రీడమ్ పార్కును ప్రారంభించిన కలెక్టర్ ఇంటింటికీ జెండాలను పంపిణీ చేశారు. గాంధీ పార్కులో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ స్థానికులతో కలిసి మొక్కలు నాటారు.