కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలపైనా కక్ష్య పూరిత ధోరణి అవలంబిస్తున్నది. ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి.. లక్షలాది మంది ఉపాధి కొల్లగొట్టిన మోదీ ప్రభుత్వం విద్యుత్ రంగంపై కన్నేసింది. విద్యుత్ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఉండగా.. వాటిని లాక్కొనే కుట్ర చేస్తున్నది.
ఇందులో భాగంగా పార్లమెంట్లో విద్యుత్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. బిల్లు ఆమోదం పొందితే విద్యుత్ పంపిణీ రంగం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తుంది. బడాబాబులు చెప్పినట్టే వినాల్సి వస్తుంది. ఫలితంగా వినియోగదారులు, వ్యవసాయదారులు, కరంటు ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కేంద్రం తీరును నిరసిస్తూ కరంటు ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విధులు బహిష్కరించి సోమవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బిల్లును వెనక్కి తీసుకునే వరకూ ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఆదిలాబాద్, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ రంగం అస్తవ్యస్తంగా ఉండేది. కరంటు ఎప్పుడు పోతుందో, ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కరంట్ సమస్యకు చెక్ పెట్టింది. ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేయడంతోపాటు పవర్ ప్రాజెక్టులను ప్రారంభించి రెప్పపాటు కూడా పోకుండా చేస్తున్నది. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరంటు సరఫరా చేస్తున్నది. దీంతో రైతులు రెండు పంటలు సాగు చేస్తున్నారు. చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలకు కూడా ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నది.
ఈ ఏడాది ఎండాకాలంలో దేశవ్యాప్తంగా కోతలు ఉన్నా.. తెలంగాణలో మాత్రం అవసరమైన విద్యుత్ను సరఫరా చేసింది. నిరంతరం విద్యుత్ పంపిణీ కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను ఉపయోగించుకుని ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. కేంద్ర ప్రభుత్వం రైతులను నష్టపరిచే విధంగా బావుల కాడ మీటర్లు పెట్టే ప్రయత్నాలు చేస్తే తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టింది. ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో అం దిస్తున్న సేవలపై అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కార్పొరేట్ సంస్థలకు అప్పగింత
ప్రజలు, రైతులు, చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే విద్యుత్ రంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్లమెంట్లో విద్యుత్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న వివిధ సంస్థలను అప్పనంగా ప్రైవేటు కంపెనీలకు అప్పగించి లక్షలాది మంది ఉద్యోగులు, స్థానికుల ఉపాధిని మోదీ ప్రభుత్వం కొల్లగొట్టింది. ఇప్పుడు విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు రంగాన్ని సిద్ధం చేసింది. ఈ బిల్లు వల్ల విద్యుత్ రంగంపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారులు తొలిగిపోనున్నాయి.
కరంటు ప్రైవేటు వ్యక్తుల చేతిల్లోకి పోతుండడంతో ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. ప్రైవేటు సంస్థలు వారి ఇష్టానుసారంగా కరంటు చార్జీలు పెంచుతారు. బావుల వద్ద వ్యవసాయ మోటర్లకు కరంటు మీటర్లు పెట్టి చార్జీలు వసూలు చేస్తారు. దీంతో రైతులకు కరంటు సరిగా ఉండకపోవడంతో నష్టపోయే ప్రమాదం ఉంది. పరిశ్రమలకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు ఇకపై ఉండవు. ఈ బిల్లు ద్వా రా ప్రైవేటు సంస్థలు డిస్కంల విద్యుత్ లైన్లను వాడుకునే అవకాశం ఉంది. కేంద్రం విద్యుత్ రంగంపై చేస్తున్న కుట్రను నిరసిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. విధులను బహిష్కరించి కేంద్రం ఈ బిల్లును వెనక్కి తీసుకోవాటంటూ నిరసన ప్రదర్శనలు చేశారు. మోదీ ప్రభుత్వానికి నిరసనగా తమ ఆందోళనలు కొనసాగుతాయని ఉద్యోగులు అంటున్నారు.
నిర్మల్లో విద్యుత్ ఉద్యోగుల ధర్నా
నిర్మల్ చైన్గేట్, ఆగస్టు 8 : కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని ప్రైవేట్ కార్పొరేటు శక్తులకు కట్టబెట్టేందుకు తీసుకువస్తున్న ప్రైవేటీకరణ బిల్లును నిరసిస్తూ సోమవారం విద్యుత్ ఉద్యోగులు జిల్లా కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ఆందోళన చేశారు. విద్యుత్ సవరణ బిల్లును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టాలని సంఘాలు ఇచ్చిన పిలుపుతో జిల్లా కేంద్రంలో జేఏసీ సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జిల్లాలోని సంఘాల నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు.
మంచిర్యాల, ఆసిఫాబాద్లో..
మంచిర్యాల టౌన్/ఆసిఫాబాద్, ఆగస్టు 8 : పార్లమెంటులో విద్యుత్ సవరణ బిల్లును ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తూ సోమవారం మంచిర్యాలలోని ఎస్ఈ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంచి రోజులు తీసుకువస్తామని చెప్పిన ఘనులు విద్యుత్ సంస్థలను తమ దోస్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వారు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బొమ్మ సత్తిరెడ్డి మాట్లాడుతూ విద్యుత్రంగానికి శాపంలా పరిణమించే సవరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్యాలయం ఎదుట విద్యుత్శాఖ అధికారులు, సిబ్బంది మహాధర్నా నిర్వహించారు. విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం తీరుపై వారు మండిపడ్డారు.
విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లుతో పేదలపై భారం..
కేంద్ర సర్కారు తీసుకొస్తున్న విద్యుత్ బిల్లు వల్ల రైతులు, సామాన్యులకు నష్టం వాటిల్లనుంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు కోల్పోయే ప్రమాదం ఉంది. వినియోగదారులపై మోయలేని భారం పడనుంది. ఉద్యోగులతోపాటు పేదలకు శాపంగా పరిణమించే అవకాశం ఉన్న దృష్ట్యా బిల్లును వ్యతిరేకిస్తున్నాం. పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాతనే అమలు చేయాలి. ప్రభుత్వ సంస్థల చేతుల్లో ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల వినియోగదారులు ఇబ్బందులు పడుతారు. వెంటనే ఉపసంహరించుకోవాలి.
– జేఆర్ చౌహాన్, సూపరింటెండెంట్ ఇంజినీర్, నిర్మల్.
ఉపసంహరించుకోవాలి.. లేకుంటే ఉద్యమిస్తాం..
మొండివైఖరితో తీసుకొస్తున్న విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును కేంద్ర సర్కారు వెంటనే ఉపసంహరించుకోవాలి. దేశవ్యాప్తంగా 27 లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు నిరసన తెలుపుతుంటే మోదీ సర్కారు పట్టించుకోకపోవడం సిగ్గు చేటు. ఈ ధర్నా కార్యక్రమాల్లో ఉద్యోగులు, ఇంజినీర్ల జాతీయ సమన్వయ కమిటీ, 1104, 324 యూనియన్, బీసీ, ఎస్సీ, మైనార్టీ అసోసియేషన్లు పాల్గొంటున్నాయి. బిల్లును వెనక్కి తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టి సంస్థను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతున్నది. దీనిని తిప్పి కొడుతాం.
– శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, 1104 తెలంగాణ ఎలక్ట్రిసిటి రాష్ట్ర యూనియన్.
అదానీ, అంబానీలకు కట్టబెట్టాలని చూస్తున్నది..
అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు విద్యుత్ రంగాన్ని ఇవ్వాలని కేంద్రం చూస్తున్నది. బడాబాబుల చేతుల్లోకి వెళ్తే వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న రైతులకు నష్టం వాటిల్లుతుంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం వల్ల రూ.5వేల నుంచి రూ.30వేల వరకు బిల్లులు వస్తాయి. రాష్ట్ర సర్కారు ఉచితంగా కరంటు ఇస్తుంటే.. కేంద్ర సర్కారు చర్యల వల్ల అన్నదాతలు నెలనెలా బిల్లు కట్టాల్సి వస్తది. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు నట్టేట మునుగుతారు. రైతులు, ప్రజల శ్రేయస్సు కోరే సర్కారే అయితే ప్రైవేటీకరణ బిల్లు మానుకోవాలి.
– మధుకర్, బీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్, నిర్మల్.