“హలో.. నేను ముఖ్యమంత్రిని మాట్లాడుతున్న’.. అంటూ గురువారం రాత్రి 9 గంటలకు కేసీఆర్.. కలెక్టర్ భారతీహోళికేరి, తహసీల్దార్ కుమారస్వామికి ఫోన్ చేశారు. వారి మధ్య సుమారు 7 నిమిషాల పాటు సంభాషణ జరిగింది. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి భూ సమస్యలు పరిష్కరించి.. రైతులకు పట్టాలివ్వాలని సీఎం ఆదేశించగా, కలెక్టర్ శుక్రవారం అక్కడ గ్రామ సభ నిర్వహించి కాస్తుదారుల పత్రాలను పరిశీలించారు. 24 గంటల్లో తనకు నివేదిక అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కాగా, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం అందించగా, ఆయన తక్షణమే స్పందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
బెల్లంపల్లి రూరల్, ఆగస్టు 5 : గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మంచిర్యాల కలెక్టర్ భారతీహోళికేరి, బెల్లంపల్లి తహసీల్దార్ కుమారస్వామికి ఫోన్ వచ్చింది. దానిని లిఫ్ట్ చేయగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘హలో మంచిర్యాల కలెక్టర్ భారతీహోళికేరి గారు..’ అంటూ పలకరించారు. కలెక్టర్తో 5 నిమిషాలు, తహసీల్దార్తో 2 నిమిషాలు సీఎం మాట్లాడారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామంలో గోనె వెంకట ముత్యంరావ్కు చెందిన సర్వే నం. 55లోని 499 ఎకరాలను 300 మంది రైతులు దశాబ్దాల కాలంగా దున్నుకుంటున్నారు. వారికి పట్టాలు మంజూరు చేయకపోవడంతో రైతుబంధు, రైతుబీమా పథకాలు అందడం లేదు.
దీంతో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురువారం రాత్రి ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసి ఈ విషయాలపై వినతి పత్రం అందించారు. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే కలెక్టర్ భారతీహోళికేరి, తహసీల్దార్తో ఫోన్లో మాట్లాడారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో శుక్రవారం ఉదయం కలెక్టర్ భారతీహోళికేరి రైతుల సమక్షంలో గ్రామ సభ నిర్వహించి కాస్తు దారుల ధ్రువ పత్రాలను పరిశీలించారు. కలెక్టరే స్వయంగా రెవెన్యూ రికార్డులో ఉన్న కాస్తుదారుల పేర్లని పిలిచి వ్యవసాయ భూములకు సంబంధించిన వివరాలను సేకరించారు. సాగుదారుల వివరాలను సేకరించి వారి వద్ద ఉన్న ధ్రువపత్రాలను పరిశీలించి 24 గంటల్లో తనకు నివేదిక అందజేయాలని బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవి, తహశీల్దార్ కుమారస్వామి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పరమేశ్వరిని ఆదేశించారు. ఈ సమస్యను అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం చేయవద్దని సూచించారు. గ్రామసభలో సర్పంచులు పొట్లపల్లి ఉమాదేవి, పొలవేని మాధవి, ఎంపీటీసీ పొట్లపల్లి సుభాష్రావ్, మండల ప్రత్యేకాధికారి దుర్గాప్రసాద్, ఎంపీడీవో డీ.రాజేందర్, గ్రామ రైతులు పాల్గొన్నారు.