ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 1 : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ముందుకుసాగుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని న్యూహౌసింగ్ బోర్డులో గల ఆదిత్య నగర్లో ప్రైమరీ హెల్త్ సబ్సెంటర్ నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేశారు. అనంతరం ఆదిత్య నగర్కు చెందిన 100మంది టీఆర్ఎస్ చేరగా, వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి, ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తున్నదని, బడా వ్యాపారులతో కుమ్మక్కై అన్ని రకాల వస్తువులపై జీఎస్టీ విధిస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ భవిష్యత్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, కౌన్సిలర్లు జాదవ్ పవన్ నాయక్, బండారి సతీశ్, అశోకస్వామి, తిరుమలేశ్, యూనీస్ అక్బానీ పాల్గొన్నారు.
జలాల్పీరి సవారీ పంజాకు ప్రత్యేక పూజలు..
పట్టణంలోని కోలిపూరలో గల జలాల్పీరి సవారీ పంజాకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొహర్రం అన్నిమతాలు, జాతుల వారు కలిసి చేసుకొని ఐకమత్యంగా నిలిచేందుకు ప్రతీగా ఉందన్నారు.
అన్నా బావు సాఠే జయంతి..
ఎదులాపురం, ఆగస్టు 1 : జిల్లా కేంద్రంలో సాహితీ సామ్రాట్ అన్నా బావు సాఠే 102వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా విగ్రహానికి ఎమ్మెల్యే జోగు రామన్న పూలమాల వేసి, నివాలులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని, వారి అడుగుజాడల్లో నడువాలని పిలుపునిచ్చారు. అన్నా బావు సాఠే సాహితీ ప్రపంచానికి ఎనలేని సేవలు చేశారని గుర్తు చేశారు. తన కవితలు, నవలలతో సమాజంలో మార్పునకు శ్రీకారం చుట్టారని, దళిత కుటుంబాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు మరవలేనివన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, కౌన్సిలర్లు బండారి సతీశ్, స్వామి, సంద నర్సింగ్, అవుల వెంకన్న, అన్న బావు సాటే అసోసియేషన్ అధ్యక్షుడు కాంబ్లె ఉద్దవ్, వాసుదేవ్, సూర్యకాంత్, గణేశ్, మాదవ్, జ్ఞానాబా తదితరులు ఉన్నారు.