ఎదులాపురం, సెప్టెంబర్ 21 : ఆరోగ్యవంతమైన ఓటరు జాబితా సిద్ధం చేసేందుకు బూత్స్థాయి అధికారులు ఎన్నికల కమిషన్ నియమావళిని పాటించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం బూత్స్థాయి అధికారులు, సూపర్వైజర్లకు 2022 ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం, బూత్స్థాయి అధికారుల రిజిస్టర్ల నవీకరణ, ఆరోగ్యవంతమైన ఓటరు జాబితా సిద్ధం చేయడం, గరుడ యాప్ డౌన్లోడ్, నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫారం-6, 6ఏ,7, 8, 8ఏ లు అందినవాటిని పరిశీలించి చర్యలు చేపట్టాలన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు 2022 ప్రకారం జాబితాను తయారుచేయాల్సి ఉంటుందన్నారు.
ప్రతీ బూత్స్థాయి అధికారి గరుడ యాప్ను డౌన్లోడ్ చేసుకొని సమర్థవంతంగా వినియోగించాలన్నారు. అంతకుముందు ప్రత్యేక ఓటరు నమోదు 2022 , రిజిస్టర్ల నిర్వహణ, ఆరోగ్య వంతమైన ఓటర్ జాబితా సిద్ధం చేయడం వంటి అంశాలపై మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ బూత్స్థాయి అధికారులు వివరించారు. అనంతరం గరుడ యాప్ వినయోగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో అదిలాబాద్ పట్టణ తహసీల్దార్ భోజన్న, ఎన్నికల విభాగం నాయబ్ తహసీల్దార్ మహేశ్, బూత్స్థాయి అధికారులు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
వంద శాతం వ్యాక్సిన్ వేయించాలి..
జైనథ్, సెప్టెంబర్ 21 : మండలంలోని జైనథ్, కాప్రి గ్రామాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. వందశాతం వ్యాక్సిన్ వేయించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలన్నారు. గిరిజన గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ అభినందనీయమని, మిగిలిన వారికి కూడా వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్వో నరేందర్రాథోడ్, ఎంపీడీవో గజానన్, తహసీల్దార్ మహేంద్రనాథ్, అదనపుడీఎంహెచ్వో సాధన, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి విజయసారథి, మండల ప్రత్యేకాధికారి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.