నిర్మల్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలు అరుదైన ఘనత సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇటీవల జాతీయ స్థాయిలో సర్వే నిర్వహించిన కేంద్ర బృందం ప్రభుత్వాసుపత్రుల పనితీరు, వైద్యుల సేవలు, ప్రసవాలు, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, టీకాల పంపిణీ కార్యక్రమం వంటి అంశాలను పరిశీలించి ప్రశంసించింది. ఇప్పటికే జిల్లా దవాఖాన, ప్రభుత్వ ప్రసూతి దవాఖానకు జాతీయ స్థాయిలో ఎన్క్వాష్, లక్ష్య అవార్డులు ఇవ్వగా, 2021-22 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం కాయకల్ప రివార్డులను ప్రకటించింది. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన నిర్మల్లోని జిల్లా ఆసుపత్రికి రూ.25 లక్షలు, తాండూరు పీహెచ్సీ రూ.2 లక్షలు, ఇక ‘కన్సొలేషన్’ కింద ఆరు పీహెచ్సీలకు రూ.50 వేల చొప్పున అందించనున్నది.
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలకు అవార్డుల పంట పండింది. ఇప్పటికే జిల్లా ఆసుపత్రి, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి జాతీయ స్థాయిలో ఎన్క్వాష్, లక్ష్య అవార్డులు దక్కగా, 2021-22 సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వం కాయకల్ప అవార్డులను ప్రకటించింది. నిర్మల్లోని జిల్లా ఆసుపత్రి అత్యుత్తమ వైద్య సేవలందించడం, నాణ్యతా ప్రమాణాలకుగాను 92శాతం మార్కు లు సాధించి రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని తాండూరు పీహెచ్సీ కూ డా 92 శాతం స్కోర్ రావడంతో ఈ రెండు దవాఖానలకు ప్రథమ స్థానాన్ని కేటాయించారు. ఇం దులో భాగంగా నిర్మల్ జిల్లా ఆసుపత్రికి రూ.25 లక్షలు అందనున్నాయి. అలాగే పీహెచ్సీల విభాగంలో 77.90 స్కోర్తో తానూర్ పీహెచ్సీ విజేతగా నిలిచి రూ.2 లక్షల క్యాష్ అవార్డుకు ఎంపికైంది.
ఆ తర్వాతి స్థానాల్లో 70 శాతానికి పైగా స్కోర్ సాధించిన జిల్లాలోని సోన్, ముజ్గి, దస్తూరాబాద్, కుభీర్, బాసర, మామడ పీహెచ్సీలకు కూడా కన్సొలేషన్ అవార్డులు దక్కాయి. ఇందులో భాగంగా ఒక్కో పీహెసీకి రూ. 50వేల క్యాష్ అవార్డు అందనున్నది. కాయకల్ప అవార్డుల కింద నిర్మల్ జిల్లాకు మొత్తం రూ.30 లక్షలు అందనున్నాయి. ఈ అవార్డు కింద వచ్చిన డబ్బుల్లో 25 శాతం డాక్టర్లు, సిబ్బందికి ఇన్సెంటివ్గా అందజేస్తారు. అలాగే మిగతా 75 శాతం నిధులను అవార్డు పొందిన ఆసుపత్రుల అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు సైతం విడుదల అయ్యాయి.
కాయకల్ప కార్యక్రమం కింద సంబంధిత దవాఖానల్లో పారిశుధ్యం, పరిశుభ్రత, రోగులకు అందుతున్న సేవలు, వ్యాధుల నియంత్రణతో పాటు అందించిన సేవలకు సంబంధించిన రికార్డులను పక్కాగా నిర్వహించడంవంటి వాటిని పరిశీలించి ఈ అవార్డులు ప్రకటించారు. ప్రతీ ఆసుపత్రికి రోజు ఎంత మంది రోగులు వస్తున్నారు, వారికి ఎలాంటి సేవలు అందుతున్నాయి.. తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డులను కేటాయించారు.
ఎన్క్వాష్, ‘లక్ష్య’ అవార్డులతో అదనపు ప్రయోజనం.
ఎన్క్వాష్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్) జాతీయ స్థాయిలో అత్యుత్తమ సేవలందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులను గుర్తించి ఆయా ఆసుపత్రులను మరింతగా ప్రోత్సహించేందుకు జాతీయ బృందం సర్వే చేపట్టింది. ఈ సర్వేలో భాగంగా నిర్మల్ జిల్లా ఆసుపత్రి, ప్రసూతి ఆసుపత్రిని రెండు దశలలో సర్వే చేశారు. ఒక్కో సర్వే మూడు రోజుల పాటు చేపట్టిన అధికారుల బృందం, ఇక్కడి ఆసుపత్రుల పనితీరు, వైధ్యుల సేవలు, ఆసుపత్రుల్లో పరిశుభ్రత నిర్వహణ, రికార్డుల నిర్వహణ, టీకాల పంపిణీ కార్యక్రమంలాంటి వాటిని అవార్డు ఎంపికకు ప్రాతిపదికగా చేసుకుంది.
అయితే ఇక్కడి ఆసుపత్రుల మెరుగైన పనితీరు, రోగులకు అందుతున్న సేవలను ప్రశంసించిన కేంద్ర అధికారుల బృందం జాతీయ స్థాయిలో 94 మార్కులను కేటాయించింది. ఈ మార్కుల ఆధారంగా జిల్లా ఆసుపత్రులు మొదటి స్థానాన్ని దక్కించుకున్నాయి. దీని కారణంగా ఇక్కడి రెండు ఆసుపత్రుల్లో గల 150 బెడ్లకుగాను ఒక్కో బెడ్కు యేటా రూ. 10 వేల చొప్పున 3 సంవత్సరాల పాటు రూ. 45 లక్షలు అందనున్నాయి. అలాగే ‘లక్ష్య’ అవార్డు కింద ప్రసూతి ఆసుపత్రికి యేటా రూ.6 లక్షల నగదు ప్రోత్సాహకం అందనున్నది. ఇలా వరుసగా మూడేళ్లపాటు మొత్తం రూ. 18లక్షలు అందనున్నాయి.
సేవలకు కేంద్ర బృందం కితాబు
కాగా జిల్లా ఆసుపత్రి, ప్రసూతి ఆసుపత్రిలో పేద రోగులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ఇక్కడి సేవలను స్వయంగా పరిశీలించిన కేంద్ర బృం దం ఆసుపత్రుల పనితీరును ప్రశంసించింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రుల అభివృధ్ధి, ఆధునిక సౌకర్యాల కల్పనకు కోట్లాది రూపాయ లు మంజూరు చేస్తున్న కారణంగానే పేద రోగులకు మెరుగైన కార్పోరేటు స్థాయి వైద్య సేవలు అందుతున్నాయంటూ కేంద్ర బృందం అభినందించింది. ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వైధ్య నిపుణులు, విశాలమైన గదులు, డయాగ్నస్టిక్ హబ్, డయాలసిస్ సెంటర్, స్కానింగ్ సెంటర్, రక్తనిధి కేంద్రం, వెంటిలేటర్ సదుపాయంతో అత్యాధునిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లాంటివి పేద రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు తోడ్పడుతున్నాయి.
సమష్టి కృషితోనే జాతీయస్థాయి గుర్తింపు
నిర్మల్ జిల్లా ఆసుపత్రి, మెటర్నిటీ ఆసుపత్రికి జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు దక్కడం వెనుక సమష్టి కృషి ఉంది. ముఖ్యంగా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అందించిన ప్రోత్సాహమే జాతీయ స్థాయి గుర్తింపుకు కారణం. ఆసుపత్రిలోని వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర కింది స్థాయి సిబ్బంది పేద రోగులకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా పెట్టుకున్నందునే ఈ అవార్డులు దక్కాయి. ప్రతీ ఒక్క ఉద్యోగి విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పని చేయడం వల్లే ఇది సాధ్యమైంది. కాగా మరో రెండు నెలల్లో ఇక్కడి జిల్లా ఆసుపత్రిలో సీటీ స్కాన్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. అనేక మందికి పేదలకు మేలు జరుగుతుంది. – డాక్టర్ దేవేందర్ రెడ్డి, సూపరింటెండెంట్, జిల్లా దవాఖాన