నేరడిగొండ, జూలై 23 : గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యురాలు లావణ్య సూచించారు. శనివారం మండలంలోని బుద్ధికొండ గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనంతరం శిబిరానికి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఈవో హరికుమార్గౌడ్, ఆర్బీఎస్కే వైద్యుడు స్వప్న, సిబ్బంది సాయన్న, సుజాత తదితరులు పాల్గొన్నారు.
వసతి గృహంలో వైద్య శిబిరం
బోథ్, జూలై 23: మండలంలోని కౌఠ (బీ) వెనుకబడిన సంక్షేమ వసతి గృహంలో శనివారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. హాస్టల్లోని విద్యార్థులను సొనాల పీహెచ్సీ వైద్యుడు కే నవీన్రెడ్డి పరీక్షించి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. విష జ్వరాలు ప్రబలుతున్నందున విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఫార్మాసిస్ట్ మనోహర్, హెచ్ఏ గోవర్ధన్, వార్డెన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జునోనిలో ..
బేల, జూలై 23: జునోని గ్రామంలో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులిచ్చారు. అంటువ్యాధులు, పరిశుభ్రత, శుద్ధజలంపై అవగాహన కల్పించారు. సర్పంచ్ వివేక్, ఏఎన్ఎం లలిత, హెచ్ఏ బాసిద్ ఉన్నారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
సిరికొండ, జూలై 23: గ్రామస్తులు తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిట్టబొంగరం పీహెచ్సీ డాక్టర్ శ్యామ్ సూచించారు. శనివారం మల్లాపూర్లో వైద్యశిబిరం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటిని వేడిచేసి చల్లార్చి తాగాలన్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి, రోగులకు మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మడావి బాపురావ్, కార్యదర్శి శ్రీధర్, వైద్య సిబ్బంది అశోక్, జలంధర్, విజయ్, ఆనంద్రావు పాల్గొన్నారు.