ఇంద్రవెల్లి, జూలై 23 : వరద నష్టాన్ని ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు సమర్పించాలని దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ, ఆర్అండ్బీ, విద్యుత్, పంచాయతీరాజ్, రెవెన్యూశాఖల పరిధిలో జరిగిన నష్టంపై ప్రాథమిక నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగనున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షంతో దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని, చెరువులు, కాల్వలు, గండ్లను పూడ్చాలన్నారు. అన్నిశాఖల అధికారులు అందుబాటులో ఉండి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. మూడ్రోజుల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. సమావేశంలో ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, పీఏసీఎస్ చైర్మన్ డోంగ్రే మారుతి, మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరామ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అంజద్ తదితరులున్నారు.
ఈశ్వరీబాయికి పరామర్శ..
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయిని పరామర్శించి ఆమె భర్త రాజు చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అంతకుముందు గ్రామ పటేల్, పీఏసీఎస్ చైర్మన్ డోంగ్రే మారుతి, పార్టీ కార్యకర్తలు, అభిమానులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జాదవ్ అనిల్, ఎంపీపీ పోటే శోభాబాయి, మండల కోఆప్షన్ సభ్యుడు మీర్జా జీలానీబేగ్, ఎంపీటీసీ జాదవ్ స్వర్ణలత, కనక తుకారామ్, పోటే సాయినాథ్, సర్పంచ్ జాదవ్ లఖణ్, మాజీ సర్పంచ్ కోరెంగ సుంకట్రావ్ పాల్గొన్నారు.