భైంసా, జూలై 22 : మున్సిపాలిటీలో ఆస్తిపన్ను బకాయిదారులకు మున్సిపల్ శాఖ తీపి కబురు అందించింది. బకాయిదారులకు 90 శాతం వడ్డీ మాఫీ చేస్తూ ఓటీఎఫ్ (వన్ టైం సెటిల్మెంట్ స్కీం) కింద 10 శాతం వడ్డీతో బకాయిలు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది అక్టోబరు నెలాఖరు వరకు ఆస్తిపన్ను చెల్లించాలని సూచించింది. ఏప్రిల్ 1 ఉంచి జూలై 16 తేదీ మధ్య పన్నులు చెల్లించిన వారికి పైకం సర్దుబాటు చేయనున్నారు. ఇంటి యజమానులు చెల్లించిన వడ్డీలో 90 శాతాన్ని వెనక్కి ఇచ్చేయాలని మున్సిపల్ శాఖ నిర్దేశించింది. కొవిడ్ సమయంలో ఓటీఎఫ్ పథకం అమలు చేయగా విశేష స్పందన లభించింది. రెండేళ్ల తర్వాత మళ్లీ మున్సిపల్ శాఖ అవకాశం కల్పించింది. ఈ విషయంపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లకు మున్సిపల్ శాఖ ఆదేశించింది. దీంతో వీలైనంత బకాయిలు రాబట్టేలా బల్దియా అధికారులు సిద్ధమవుతున్నారు. భైంసా మున్సిపాలిటీలో రూ. కోటి 80 లక్షలు రావాల్సి ఉంది.
వడ్డీ మాఫీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
బకాయిదారులకు ప్రభుత్వం కల్పించిన 90 శాతం వడ్డీ మాఫీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అక్టోబర్ నెలాఖరు వరకు అవకాశం కల్పించింది. ఇందుకుగాను మున్సిపాలిటీలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నాం. సాధ్యమైన వరకు బకాయిలు రాబడతాం. –అలీం, మున్సిపల్ కమిషనర్