ఆదిలాబాద్ ప్రతినిధి/నిర్మల్(నమస్తేతెలంగాణ), జూలై 13: ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు జలవిలయాన్ని తలపిస్తున్నాయి. ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకుతోడు మహారాష్ట్రలో పడుతున్న వానల వల్ల ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. లక్షల క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండడంతో కడెం, స్వర్ణ, సాత్నాల, గడ్డెన్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడంతో వరద పరవళ్లు తొక్కతున్నది. కడెం ప్రాజెక్టు ప్రమాదకరస్థాయికి చేరుకోవడంతో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కాగా.. సీఎం కేసీఆర్ వరద పరిస్థితిపై అమాత్యుడికి ఫోన్ చేసి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. పలు కాలనీలు, పల్లెలు జలదిగ్బంధంలో చిక్కుకోగా.. జనజీవనం స్తంభించింది. పోలీసు, రెవెన్యూ అధికారులు ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, భోజన వసతి కల్పించారు. పంట నష్టం, వరద బాధితులను ఆదుకుంటామని ఎమ్మెల్యే రామన్న భరోసా ఇచ్చారు. కాగా.. గోదావరి, ప్రాణహిత, పెన్గంగ నదులు ఉగ్రరూపం దాల్చగా.. అధికార యంత్రాంగం రెడ్ అలర్ట్ ప్రకటించింది.
నిర్మల్ జిల్లాలో ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో కడెం, గడ్డెన్న, స్వర్ణ ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ప్రధానంగా వరద ఉధృతి కారణంగా కడెం ప్రాజెక్టు ప్రమాదకర స్థితికి చేరుకున్నది. ఎగువ నుంచి 5 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 17 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నిరాటంకంగా వరద రిజర్వాయర్లోకి చేరడం ఆందోళన రేకెత్తిస్తున్నది. ఇన్ఫ్లోకు సమానంగా అవుట్ఫ్లో లేకపోవడం, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం భారీగా ఉన్న కారణంగా ప్రాజెక్టుకు ముప్పు తప్పకపోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాల్లోని 25 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం, రాంపూర్, మున్యాల, గొడిసిర్యాల ప్రజలను ముందస్తుగా సహాయ కేంద్రాలకు తరలించారు.
కాగా.. నీటిపారుదలశాఖ అధికారులు ప్రాజెక్టు వద్దే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు వరద ప్రమాదం ముంచుకొచ్చిందన్న సమాచారం తెలుసుకున్న మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హుటాహుటిన ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే రేఖానాయక్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఉన్నారు. అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిరాశ్రయులందరికి సదుపాయాలు కల్పించాలని సూచించారు. కడెం పరిస్థితిపై సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలతోపాటు ముంపు గ్రామాల్లో చేపడుతున్న సహాయక చర్యల గురించి వివరించారు.
కొనసాగుతున్న వరద
సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 28,200 క్యూసెక్కులు ఉండగా, నాలుగు గేట్లు ఎత్తి 32,100 క్యూసెక్కుల నీటిని దిగువనకు వదులుతున్నారు. స్వర్ణ పరీవాహక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. నిర్మల్ పట్టణ శివారుల్లోని వాగు ఒడ్డున గల జీఎన్ఆర్ కాలనీ నీట మునిగింది. అధికారులు ముందుగానే ఇక్కడి చేరుకొని ఇండ్లను ఖాళీ చేయించడంతో ప్రమాదం తప్పింది. నిర్మల్ నుంచి కౌట్ల, సిద్దులకుంట గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. భైంసాలోని గడ్డెన్న వాగుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 45 వేల క్యూసెక్కులు ఉండగా, నాలుగు గేట్లను ఎత్తి 55 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో భైంసా పట్టణంలోని వినాయక్నగర్, ఆటోనగర్ నీట మునిగాయి.
కాగా.. బాసరలోని రవీంద్రపూర్ కాలనీకి చెందిన వరద ముంపు కుటుంబాలకు బాసర ఆలయ సమీపంలోని టీటీడీ గదుల్లో వసతి కల్పించారు. పెంబి మండలంలో పెంబి వాగు ఉధృతి కారణంగా ఇటిక్యాల వంతెన తెగిపోవడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కుంటాల మండలంలోని సూర్యాపూర్ చెరువుకు గండిపడడంతో చెరువు నీరు పొలాల్లోకి చేరింది. ఓలా-మెదన్పూర్ గ్రామాల మధ్య గల లోలెవల్ బ్రిడ్జి పైనుంచి ఓల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. మహారాష్ట్రకు చెందిన 11 మంది కూలీలను వాగు దాటిస్తుండగా నీటిలో వాహనం ఒరిగింది. దీంతో గ్రామస్తులు వాహనంలోని 11 మందిని కాపాడడంతో ప్రమాదం తప్పింది. లక్ష్మణచాంద మండలం వడ్యాల్లో పాత ఇల్లు కూలగా.. ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధుడు మృతిచెందాడు. భైంసా మండలంలోని గుండేగాం గ్రామంలోకి భారీగా వరద చేరడంతో గ్రామస్తులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల కోసం 18004255566 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులో ఉంచారు.
లక్ష్మణచాందలో 286.4 మిల్లీ మీటర్ల వర్షపాతం..
బుధవారం జిల్లా సగటు వర్షపాతం 185.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. అత్యధికంగా లక్ష్మణచాంద మండలంలో 286.4, కుభీర్లో 184.6, తానూర్లో 196.4, బాసరలో 83.5, ముథోల్లో 117.4, భైంసాలో 154.6, కుంటాలలో 180.2, నర్సాపూర్(జి)లో 136.5, లోకేశ్వరంలో 140.2, దిలావర్పూర్లో 225.2, సారంగాపూర్లో 220.6, నిర్మల్లో 232.4, నిర్మల్ రూరల్లో 194.2, సోన్లో 165.3, మామడలో 187.2, పెంబిలో 225.3, ఖానాపూర్లో 220.2, కడెంలో 201.6, దస్తురాబాద్లో 166.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బుధవారం భారీ వర్షం కురిసింది. ఉట్నూర్ మండలంలోని మత్తడి చెరువు కాల్వకు గండి పడగా గంగన్నపేట గ్రామ సమీపంలోని పలు ఇండ్లలోకి నీరు చేరింది. ఆదిలాబాద్ రూరల్ మండలం చించుఘాట్ రహదారిలో వంతన కూలిపోగా రాకపోకలు నిలిచాయి. నేరడిగొండ మండలం సావర్గాం వాగు ఉప్పొంగడంతో రోడ్డుపైకి నీరు వచ్చి 14 గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. ఇంద్రవెల్లి మండలంలోని పలు కాలనీల్లో ఇండ్లలోకి నీరు చేరింది. ఆదిలాబాద్ రూరల్ మండలం చించూఘాట్, జెండాగూడ గ్రామాల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పర్యటించారు. గ్రామస్తులకు రేషన్ సరుకులతోపాటు ఆహారం అందించాలని, గిరిజన బాలికల హాస్టల్ను సందర్శించి విద్యార్థులను ఆదిలాబాద్ హాస్టల్కు తరలించాలని అధికారులకు సూచించారు. ఉట్నూర్ మండలం మత్తడి చెరువును జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ సందర్శించారు.
ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
భారీ వర్షాల కారణంగా సాత్నాల, మత్తడి ప్రాజెక్టుల్లోకి వరద నీరు పోటెత్తుతున్నది. ముందు జాగ్రత్తగా అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువనకు వదులుతున్నారు. సాత్నాల ప్రాజెక్టులోకి 13,096 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. నాలుగు గేట్లు ఎత్తి 13,096 క్యూసెక్కులు వదిలారు. మత్తడి ప్రాజెక్టులోకి 8,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. మూడు గేట్ల ద్వారా 8,500 క్యూసెక్కుల నీటిని బయటకు విడిచిపెట్టారు. ఇరిగేషన్ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. వరద నీటితో కుంటాల, పొచ్చెర జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. కాగా.. జిల్లా సగటు వర్షపాతం 200 మిల్లీమీటర్లు కాగా.. అత్యధికంగా ఆదిలాబాద్ రూరల్ మండలంలో 312.8, గుడిహత్నూర్లో 291.8, సిరికొండలో 288.3, ఉట్నూర్లో 235.6, ఇంద్రవెల్లిలో 256.8, ఇచ్చోడలో 226.6, నేరడిగొండలో 198.1, బోథ్లో 150.2 మిల్లీమీటర్ల వర్షం పడింది.