ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా.. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుం డడం, వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు అనుకూలమని సూచించడంతో రైతన్నలు పత్తి, సోయా, కంది ఇతర విత్తనాలను విత్తారు. వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ బిజీగా మారారు. ఉమ్మడి జిల్లాలో 18.27 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తుండగా.. 1,220.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా.. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆదిలాబాద్ జిల్లాలో 297.8 మిల్లీ మీటర్లు, నిర్మల్లో 264.4 మిల్లీ మీటర్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 356.7 మిల్లీ మీటర్లు, మంచిర్యాల జిల్లాలో 301.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఆదిలాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ సర్కారు రైతు పక్షపాతిగా మారింది. రైతన్నలకు సబ్సిడీలు అందిస్తుండడంతో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. ఈ యేడాది వానకాలం సీజన్కు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 18.27 లక్షల ఎకరాల్లో పంటలు సాగవనున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. గతేడాది పత్తికి రికార్డు స్థాయిలో ధర రూ.14 వేలకు పైగా పలికింది. ఫలితంగా పత్తి వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో 5.71 లక్షలు, నిర్మల్ జిల్లాల్లో 1.60 లక్షలు, మంచిర్యాలలో 3.85 లక్షలు, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 4.51 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా అధికా రులు అన్ని చర్యలు తీసుకున్నారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం కూడా రైతుబంధు డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ చేసింది. దీంతో రైతులు మేలురక మైన విత్తనాలను కొనుగోలు చేశారు. జూన్ రెండు, మూడో వారంలో పత్తి, సోయా విత్తనాలు విత్తారు.
ఆశాజనకంగా సాగు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలం ప్రారంభం నుంచి క్రమంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పత్తి, సోయాబిన్, కంది ఇతర పంటల విత్తనాలు మొలకెత్తాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఈ సీజన్లో ఇప్పటివరకు 297.8 మిల్లీ మీటర్లు, నిర్మల్ జిల్లాలో 264.4 మిల్లీ మీటర్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 356.7 మిల్లీ మీటర్లు, మంచిర్యాల జిల్లాలో 301.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో నల్లరేగడి భూములు అధికంగా ఉండడంతో భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుందని, ఇప్పటి వరకు కురిసిన వర్షాలు పత్తికి అనుకూలమని అధికారులు పేర్కొంటున్నారు.
విత్తనాలు మొలకెత్తడంతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా మారారు. ఎరువులను కూడా సరైన సమయంలో వేయడానికి సిద్ధంగా ఉంచుకున్నారు. వానకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తుండగా, ఈ సీజన్ ఆశాజనకంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. సాగులో రైతులకు రైతు వేదికల్లో సలహాలు, సూచనలు ఇస్తున్నామని తెలిపారు.