సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నదని తెలంగాణ విద్యా, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించారు. మన ఊరు-మన బడి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 26 వేల పాఠశాలల్లో రూ.7,300 కోట్లతో బడుల ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 269 పాఠశాలల్లో రూ.82.50 కోట్లతో 12 రకాల పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఆదిలాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం కేసీఆర్ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతున్నదని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించారు. మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.
ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కారణంగా ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా, సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల బంగారు భవిష్యత్కు చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో 26 వేల పాఠశాలల్లో రూ.7300 కోట్లతో పాఠశాలల ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ.36.24 కోట్లతో ప్రహరీ, మరుగుదొడ్లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 269 పాఠశాలల్లో రూ.82.5 కోట్లతో 12 రకాల పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు స్వాగతించి, తమ పిల్లలను సర్కారు స్కూళ్లలో చేర్పిస్తున్నారన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు, ఎస్ఏసీ కమిటీ సభ్యులు కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం అన్ని జిల్లాల్లో 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఈ అశోక్, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల డీఈలు గంగాధర్ గౌడ్, శంకర్ శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు.