నేరడిగొండ, జూలై 6 : ప్రస్తుతం వ్యవసాయం చేయాలంటే యంత్రాలపైనే ఆధారపడాల్సి వస్తున్నది. భారీ యంత్రాలను కొనుగోలు చేయలేని సన్న, చిన్నకారు రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తుండగా, వారు అందినకాడికి దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు తక్కువ ధరకే వ్యవసాయ యంత్రాలను కిరాయికి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా నేరడిగొండలో కస్టమర్ హైరింగ్ సెంటర్ను ఏర్పాటు చేయించింది.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో యాంత్రీకరణ సదుపాయాలు కల్పించడం వల్ల అటు మహిళలకు ఆర్థికభరోసా రానుండగా, ఇటు అన్నదాతలకూ సాగు ఖర్చులు మిగులుతాయి. నేరడిగొండ మండలంలో భవిత మండల సమాఖ్య వారికి స్త్రీ నిధి ద్వారా రూ. 10 లక్షలు, ఎన్ఆర్ఎల్ఎం ద్వారా రూ.4.25 లక్షల రుణం మంజూరు చేయగా, ట్రాక్టర్, రొటోవేటర్, క్రెషర్, కల్టివేటర్,ఫ్లవ్, సీడ్డ్రిల్ తదితర పరికరాలు కొనుగోలు చేశారు.
ప్రస్తుతం వ్యవసాయ యంత్రాల రక్షణ కోసం భవిత మండల సమాఖ్య కార్యాలయం ఎదుట రూ. 1.50 లక్షలతో షెడ్డు నిర్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న యంత్రాల అద్దె కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.లక్షా 17వేల 800 అద్దె వచ్చింది. ఇప్పటికే నేరడిగొండ, తాంసి, గుడిహత్నూర్ మండలాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయగా, త్వరలో అన్ని మండలాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా, మార్కెట్కంటే తక్కువ కిరాయికి యంత్రాలు ఇవ్వడంపై అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు సాగు ఖర్చులు తగ్గుతాయి
మహిళా సమాఖ్య ద్వారా అద్దె యంత్రాల కేంద్రం ఏర్పాటు చేశాం. ఎమ్మెల్యే చేతుల మీదుగా దీనిని ప్రారం భించాం. ఇప్పటికే రైతులు తక్కువ ధరకు వ్యవసాయ పనిముట్లను అద్దెకు తీసుకెళ్తు న్నారు. దీంతో రైతులకు సాగు ఖర్చులు తగ్గుతున్నాయి.
– సుదర్శన్, ఐకేపీ ఏపీఎం
మహిళా సమాఖ్యకు ఆర్థిక సహకారం
రైతు సేవా కేంద్రాల నిర్వహ ణ బాధ్యతను మహిళా సమాఖ్యకు అప్పగించడం బాగుంది. ఇది మా ఆర్థిక ఎదుగుదలకు దోహద పడుతుంది. సక్రమంగా అద్దెకు ఇచ్చి రుణం సకాలంలో తీర్చుకుంటే తర్వాత మహిళలు ఆర్థికంగా ఎదుగు తారు. ఈ పథకం గొప్పది.