బెల్లంపల్లి, జూలై 5 ;సర్కారు నోటిఫికేషన్ల నేపథ్యంలో యువత ప్రిపరేషన్లో నిమగ్నమైంది. మరికొందరు శిక్షణా కేంద్రాలవైపు చూస్తున్నారు. కాని పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిందే. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ తీసుకుంటారు. అద్దె గదులు, హాస్టళ్లలో ఉంటూ శిక్షణ కేంద్రాల్లో తరగతులకు హాజరవుతారు. ఇటు ఉండడానికి,అటు శిక్షణకు చెల్లించాల్సిన డబ్బులు తడిసి మోపడవుతాయి. శిక్షణ కేంద్రం, వసతి వేర్వేరుగా ఉన్న సందర్భాల్లో మధ్యాహ్నం పస్తులు లేదా హోటళ్లలో తినడానికి వేరుగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అరకొర వసతులతో అభ్యర్థులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది.
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 75 రోజుల ఉచిత శిక్షణ
నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. వారి ఇబ్బందులకు అడ్డుకట్ట వేయాలని కంకణం కట్టుకున్నారు. అభ్యర్థులకు ఉచితంగా 75 రోజుల పాటు శిక్షణ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. బెల్లంపల్లి పట్టణంలోని టీసీవోఏ క్లబ్ ఏరియా తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో మే 23న టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ఈ ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఇక్కడ నాణ్యమైన ఉచిత భోజన వసతి కూడా కల్పిస్తున్నారు. ఎలాంటి శబ్ధ కాలుష్యం లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో తరగతులు నిర్వహిస్తున్నారు. గ్రూప్ 1,2,3,4 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నిష్ణాతులైన ఫ్యాకల్టీతో బోధన అందిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం,మధ్యాహ్నం ఒకే సబ్జెక్ట్ బోధించే విధంగా కార్యాచరణ రూపొందించారు.
సొంతంగా వండుతూ…
ఉచితంగా అందిస్తున్న శిక్షణలో ఎమ్మెల్యే సతీమణి జయతార ఉద్యోగార్థులకు తనవంతు తోడ్పాటును అందిస్తున్నారు. శిక్షణకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో వంటకాలు తయారు చేసి పంపిస్తున్నారు. కూరగాయాలు తరగడం, కొన్ని వంటలు తనే స్వయంగా వండి అభ్యర్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు. ప్రతీరోజు ఏ కూర వండుతున్నారో అడిగి తెలుసుకుంటూ నాణ్యమైన భోజనం అందేవిధంగా సాయం చేస్తున్నారు.
ఇబ్బందులు పడకూడదని..
తెలంగాణ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిరుద్యోగులు శిక్షణ కోసం హైదరాబాద్, వరంగల్ వంటి ప్రాంతాలకు వెళ్లి ఆర్థిక.. తదితర ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతోనే ఇక్కడే ఉచితంగా శిక్షణ శిబిరం ఏర్పాటు చేశాను. సొంత ఖర్చులతో శిక్షణ, భోజన వసతి, స్టడీ మెటీరియల్ అందిస్తున్నాను. నియోజకవర్గంలోని ఏడు మండలాల అభ్యర్థులే కాకుండా మందమర్రి, తిర్యాణి, రెబ్బెన మండలాల నుంచి కూడా అభ్యర్థులు వస్తున్నారు. ఎంతమందికైనా శిక్షణ ఇవ్వడానికి సిద్ధమయ్యే ముందుకు వచ్చాను. ఎంట్రెన్స్ రాసిన 250 మందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. నిష్ణాతులైన ఫ్యాకల్టీతో శిబిరం విజయవంతంగా కొనసాగుతోంది. ఎన్ని పనులు ఉన్నా ఎప్పటిక ప్పుడు శిక్షణ తరగతులు, భోజన వసతిని పర్యవేక్షించడానికి సమయాన్ని కేటాయిస్తూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాను. ఉచిత శిక్షణ తరగతులను అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి. –దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి ఎమ్మెల్యే
తృప్తిగా ఉంది..
ఉచిత శిక్షణ శిబిరానికి హాజరయ్యే అభ్యర్థులందరికీ సొంతంగా భోజనం తయారు చేసి అందించడంలో ఎంతో తృప్తి ఉంది. ఓ రోజు కూరగాయలు తరగడం, మరో రోజు వంటలు చేస్తున్నా. వంటలు రుచికరంగా, నాణ్యంగా ఉండేలా చూస్తున్నా. ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే సతీమణిగా సహకారం అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. –జయతార, ఎమ్మెల్యే సతీమణి
గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నా..
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సార్ ఆధ్వర్యంలో ఇస్తున్న ఉచిత శిక్షణ శిబిరంలో గ్రూప్-4కు కోచింగ్ తీసుకుంటున్నా. మాది నెన్నెల మండలం ఘనపురం. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్నా. తండ్రి మధునయ్య వ్యవసాయ కూలీ. కోచింగ్కు పంపించే స్థోమత లేదు. ఇంట్లోనే ఉంటూ అందుబాటులో ఉన్నపుస్తకాలతో ప్రిపేర్ అవుదామ నుకున్నా. కాని మా ఎమ్మెల్యే దేవునిలా వచ్చి ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఎంట్రెన్స్ టెస్ట్లో క్వాలిఫై అయి శిక్షణ తీసుకుంటున్నా. పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించి తీరుతా. -జనగాం రమ్య, నెన్నెల
శిక్షణ బాగుంది..
తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణమండపంలో ఉచితంగా ఇస్తున్న తరగతులు చాలా బాగా ఉన్నాయి. ప్రతి రోజూ ఒకే సబ్జెక్ట్ను ఉదయం.. సాయంత్రం అర్థమయ్యేలా చెబుతున్నారు. ప్రతిరోజూ భీమిని మండలం జగ్గయ్యపేట నుంచి వచ్చి తరగతులు వింటున్నా. ఫ్యాకల్టీ చాలా బాగుంది. అనుభవజ్ఙులైన లెక్చరర్లతో చెబుతున్నారు. తప్పకుండా జాబ్ కొడుతాననే నమ్మకం కలుగుతోంది. సబ్జెక్ట్ల వారీగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
–జంగపల్లి ప్రవళిక, భీమిని
మెటీరియల్ కొనేస్థోమత లేదు
తిర్యాణి మండలం గంభీరావుపేట గ్రామం నుంచి వచ్చి ఇక్కడ శిక్షణ తీసుకుం టున్నా. సంబంధిత పుస్తకాలు కొనే స్థోమత లేదు. ఇక్కడ ఉచితంగా శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ను కలెక్టర్ భారతీ హోళికేరి చేతుల మీదుగా అందుకున్నా. బయటి మార్కెట్లో తీసుకుంటే రూ.2500 ఖర్చు అయ్యేది. ఉచితశిక్షణ, ఉచిత భోజనం, ఉచిత స్టడీ మెటీరియల్ అందిస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ప్రత్యేక కృతజ్ఙతలు. -బర్ల మల్లేశ్,తిర్యాణి
ప్రవేశ పరీక్ష రాసి సెలక్ట్ అయిన..
ఇంటర్ పాసయ్యాను. కానిస్టేబుల్ కావాలనేదే నా లక్ష్యం. ఇది వరకు ఇంట్లో కూర్చొని అందుబాటులో ఉన్న పుస్తకాలను చదివి ప్రిపేర్ అయ్యేదాన్ని. హైదరాబాద్కు వెళ్లి కోచింగ్ తీసుకోలేని పరిస్థితి. 3ఏండ్ల పాప, 8 ఏండ్ల బాబు ఉన్నారు. భర్త తాపీ మేస్త్రీ. పిల్లలను వదిలి దూరం వెళ్లి కోచింగ్ తీసుకోలేను. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే ఉచితంగా కానిస్టేబుల్ కోచింగ్ ఇస్తున్నారని తెలుసు కొని ప్రవేశ పరీక్ష రాశాను. సెలెక్ట్ అయి ప్రతిరోజూ రెబ్బెన మండలం తక్కళ్లపల్లి నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నా. తప్పని సరిగా జాబ్ వస్తుందనే నమ్మకం కలిగింది. – మైదం సుగుణ, గృహిణి, రెబ్బెన
శిక్షణ శిబిరం చారిత్రాత్మకం
నిరుద్యోగ యువత కోసం ఉచితంగా శిక్షణ శిబిరం నిర్వహించడం చారిత్రాత్మకం. 75 ఏండ్లుగా ఇలాంటి తరగతులు ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి. దూరప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే తరగతులు నిర్వహిస్తుండడంతో నిరుపేద యువతకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతోంది. ఉచిత శిక్షణ తరగతులు, ఉచిత భోజనం, ఉచిత స్టడీ మెటీరియల్ అందించడం గొప్ప విషయం. ఎమ్మెల్యే చిన్నయ్యకు అభ్యర్థులు రుణపడి ఉండాలి. ఈ సారి గ్రామీణ అభ్యర్థుల నుంచి ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించవచ్చు. – వొజ్జ జయరాం,అర్థమెటిక్, రీజనింగ్ ఫ్యాకల్టీ