ఎదులాపురం,జూలై5: వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి టీ హరీశ్ రావు అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ , ప్రభుత్వ దవాఖాన్లలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వైద్య శాఖ పనితీరుపై మంగళవారం హైదరాబాద్ నుంచి ఆయన కలెక్టర్లు, వైద్యాధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదిలాబాద్ నుంచి కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉన్నందున నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఐటీడీఏ ,వైద్యరోగ్య, పంచాయితీరాజ్ శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సీజన్లో ఇప్పటి వరకు 30 డెంగీ కేసులు నమోదైనట్లు తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 148హై రిస్క్ ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు. ప్రతి శుక్రవారం వారం డ్రై డే నిర్వహిస్తున్నామని తెలిపారు. టెలికాన్ఫరెన్స్లో ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, అదనపు వైద్యారోగ్య శాఖ అధికారి మనోహర్, డీఎంవో శ్రీధర్ ఉన్నారు.