భీంపూర్, జూలై 5 : భీంపూర్ మండలం అంతర్గాం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలకు స్వచ్ఛవిద్యాలయ పురస్కార జాబితాలో చోటు దక్కింది. బుధవారం ఆదిలాబాద్లోని కలెక్టరేట్లో ఈ పురస్కారం. జ్ఞాపికను కలెక్టర్ అందజేయనున్నారు. ప్రాథమికోన్నత పాఠశాల(యూపీఎస్)లో 112 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీకాంత్ , ఉపాధ్యాయుడు జయసారథి అన్ని తరగతులు బోధిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, పాఠశాల శుభ్రత, మరుగుదొడ్ల స్వచ్ఛత, రోజూ శుద్ధజలం అందించడం, బోధనపై శ్రద్ధ తీసుకుంటున్నారు. కరోనా సమయంలో ఆన్లైన్ తరగతుల నిర్వహణ, పాఠశాలలో కొవిడ్ నిబంధనలు పాటించడం, స్వచ్ఛత, పచ్చదనం వంటి విభాగాల్లో పరిశీలన చేసి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ప్రైవేట్ వద్దని సర్కారు స్కూళ్లలోనే అన్ని సౌకర్యాలు ఉన్నాయని ప్రధానోపాధ్యాయుడు, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు, సర్పంచ్ ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించడంతో పాటు కరపత్రాలు పంచిపెట్టారు. ఫలితంగా అంతర్గాంలోని పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది.
పాఠశాలలో సౌకర్యాలు
పాఠశాల ఆవరణలో కొన్నేళ్లుగా బడితోట సాగు చేస్తున్నారు. ఈ తోటలో పండిన ఆకుకూరలు, కూరగాయలు మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తున్నారు. జామ, బొప్పాయి, సీతాఫలం, తదితర పండ్లు సీజన్ల వారీగా విద్యార్థులకు అందజేస్తున్నారు. మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చూస్తున్నారు. పాఠశాల కోసం హెచ్ఎం ప్రతి రోజూ శుద్ధజలం నీరు తెప్పిస్తున్నారు. బడితోట నిర్వహణలో వంట సహాయకులు జబ్బార్, శుభ్రత పనులు పంచాయతీ కార్మికులు చేపడుతున్నారు. 2018లో ఈ పాఠశాలకు బడితోట అవార్డు వచ్చింది.
పంచాయతీ, వీడీసీ పర్యవేక్షణ
ప్రతి నెలా ఇక్కడ ఎస్ఎంసీ చైర్మన్ ఖాదర్ అధ్యక్షతన, సర్పంచ్ బక్కి లలిత ఆధ్వర్యంలో సమావేశాల నిర్వహిస్తున్నారు. ఏమైనా లోపాలు ఉంటే గుర్తించి సవరిస్తున్నారు. కొత్తగా చేయగలిగే వాటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు. కార్యదర్శి నర్సయ్య పాఠశాల పని దినాల్లో బడికి వచ్చి సౌకర్యాల పర్యవేక్షణ చేస్తారు. గురుకుల పరీక్షల కోసం ఉచిత పుస్తకాలు అందజేయడం, వీరే దగ్గరుండి దరఖాస్తులు చేయిస్తారు. ఇప్పటికే ఈ పాఠశాల నుంచి 12 మంది గురుకులాలు , ఇతర వసతి గృహాలల్లో సీట్టు పొందారు.
హెచ్ఎం కూతురు సర్కారు బడిలోనే..
నెలనెలా తన జీతం నుంచి కొంత పేద పిల్లల చదువుల కోసం వెచ్చించే హెచ్ఎం శ్రీకాంత్ తన కూతురును కూడా ఆదిలాబాద్లోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. కూతురి పుట్టినరోజున తను విధులు నిర్వహించే పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్లు అందజేస్తున్నారు. ఆదిలాబాద్- కరంజి(టీ) రోడ్డుగుండా వెళ్లేటప్పుడు అర్లి(టీ) తర్వాత వచ్చే అంతర్గాం రోడ్డు పక్కనే పచ్చదనం నడుమ కనువిందు చేసే ఈ ఆదర్శ పాఠశాల ఇప్పుడు రాష్ట్రస్థాయి స్వచ్ఛ అవార్డుల పరిశీలనలో ఉన్నది.
అందరి సహకారంతో ప్రగతి
పాఠశాల ఉన్నతిలో తోటి ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ, పంచాయతీ, వీడీసీల పాత్ర చాలా ఉంటుంది. ఇక్కడ కూడా మాకు సహకారం అందింది. గ్రామస్తులు విద్యకు మొదటి ప్రాధాన్యతగా గుర్తించి అవసరమైన సహకారం అందిస్తున్నారు. టీంవర్క్తోనే ఇది సాధ్యమైంది. ఈ పురస్కారం బాధ్యతను పెంచింది. బాధ్యతకంటే ఎక్కువ పని చేసి ఫలితాలు సాధించాలనేదే మా ఆలోచన. -శ్రీకాంత్ , హెచ్ఎం, అంతర్గాం