కుభీర్, జూలై 5 : నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, ప్రతి గ్రామంలో ఏర్పాటుకు ప్రజలు సహకారం అందించాలని భైంసా ఏఎస్పీ కిరణ్ఖారే కోరారు. కుభీర్ పోలీస్ స్టేషన్ను మంగళవారం సందర్శించారు. నూతనంగా నిర్మించిన రిసెప్షన్ గదిని రూరల్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ ఎండీ షరీఫ్తో కలిసి ప్రారంభించారు. అంతకు ముందు ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆవరణలో మొక్కలను నాటి నీరు పోశారు. పచ్చదనాన్ని కాపాడాలని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. పోలీసుల వందనం స్వీకరించిన అనంతరం ఆయన సిబ్బంది ఒక్కొక్కరితో మాట్లాడారు. వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. ఠాణాలో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మండల ప్రజలు కోరేది ఒక్కటే దుకాణాలు, కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ముస్లింలకు ముందస్తుగా బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట ఏఎస్సై శివనాథ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.