నిర్మల్ అర్బన్/బోథ్/నిర్మల్ టౌన్/పెంబి, జూలై 4 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలో సోమవారం 49.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జన్నారం మండలంలో 34.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, దండేపల్లిలో 22.8, లక్షెట్టిపేటలో 17.9, హాజీపూర్లో 25.8, కాసిపేటలో 42, తాండూరులో 51, భీమినిలో 24.3, కన్నెపల్లిలో 76.6, వేమనపల్లిలో 76, నెన్నెలలో 93.1, బెల్లంపల్లిలో 127.5, మందమర్రిలో 41.7, మంచిర్యాలలో 47.6, నస్పూర్లో 42.8, జైపూర్లో 35.8, భీమారంలో 41, చెన్నూర్లో 22, కోటపల్లి మండలంలో 70 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఈ ఏడాది జూన్ ఒకటవ తేదీ నుంచి సోమ వారం వరకు 231.8 మిల్లీ మీటర్లు కాగా 279.6 మిల్లీ మీటర్లు కురిసింది. అంటే 21 శాతం అధిక వర్షపాతం నమోదైంది. శ్రీరాంపూర్ తదితర ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కోటపల్లి మండలంలో భారీ వర్షానికి పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. కోటపల్లి మండలం ఎదుల్లబంధం వద్ద గల తుంతుంగ వాగు పొంగి పొర్లుతున్నది. కాగా, ఇటీవల బ్రిడ్జి ప్రారంభించడంతో రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. వాగు అవతల ఉన్న ఎదుల్లబంధం, సిర్సా, పుల్లగామ, రొయ్యలపల్లి, ఆలుగామ, జనగామ, సూపాక, వెంచపల్లి, నందరాంపల్లి గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడింది.
రాంపూర్ సమీపంలోని వాగులో గ్రామస్తులు చేపలు పట్టారు. చెన్నూర్ మండలంలోని బతుకమ్మ వాగుకు జలకళ వచ్చింది. కిష్టంపేటలో బొమ్మని రాజం ఇల్లు కూలిపోయింది. బాధిత కుటుంబానికి సర్పంచ్ రాకేశ్ గౌడ్, ఉప సర్పంచ్ నాయకులు రూ. 8వేలు అందించారు. ఆర్ఐ స్వప్న కూలిన ఇంటిని పరిశీలించి నష్టపరిహారం అంచనా వేశారు. సాగు పనుల్లో నిమగ్నమైన రైతులు సంబురపడిపోతున్నారు. మంచిర్యాల మండలంలోని రాళ్లవాగులో జాలర్లు చేపలు పట్టారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లోనూ వర్షం కురిసింది. బెజ్జూర్ మండలం సలుగుపల్లి-సులుగుపల్లి గ్రామాల మధ్య గల తీగల ఒర్రె పొంగడంతో కాగజ్నగర్, బెజ్జూర్ వయా పెంచికల్పేట్ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బెజ్జూర్, సోమిని మార్గంలో లోతొర్రె, కుశ్నపల్లి ఒర్రెలు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వచ్చిం ది. కౌటాల మండలంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం 12 గంటలవరకు నిరంతరా యంగా వర్షం కురవడంతో చెరువులు, కుంటల్లోకి వరద వచ్చి చేరింది.
అక్కడ క్కడా పంట పొలాల్లో వరద నిలిచింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు ప్రాజెక్టులోకి వరద చేరడంతో సోమవారం ప్రాజెక్టు అధికారులు రెండు గేట్లు ఎత్తారు. ప్రాజెక్టు 2.890 టీఎంసీల సామర్థ్యం కాగా, 2167 క్యూసెక్యుల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుత నీటి మట్టం 2.404 టీఎంసీలు ఉంది.చింతలమానేపల్లి మండలంలోని దిందా-కేతిని వాగు పొంగి పొర్లుతున్నది. సోమవారం ఎంపీడీవో మహేందర్, ఎంపీవో శ్రీధర్,ఏపీవో రాజన్న పరిశీలించారు. బాలాజీఅన్కోడ, రవీంద్రనగర్ మధ్య ఒర్రె బాబాసాగర్ నుంచి నాయికపు వెళ్లేవాగు, రణ్వెల్లి వాగులు పొంగి పొర్లుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వర్షం కురిసింది. బోథ్ మండలంలో 107.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కడెం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. పొచ్చెర జలపాతం పరవళ్లు తొక్కుతున్నది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుం డగా, జలపాతం వద్ద నీరు ఎగిసిపడుతున్నది. జలపాతం అందాలను వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. సెల్ఫోన్లు, కెమెరాలతో జలపాతం అందాలను చిత్రీకరించారు. పెద్దవాగు, ధన్నూర్ (బీ), మర్లపెల్లి, చింతల్బోరి వాగుల్లో నీటి ప్రవాహం పెరిగింది. బోథ్-నిగిని రోడ్డు నిర్మాణంలో భాగంగా పట్నాపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన సగం వరకు కొట్టుకుపోయింది. బండరాళ్లు తేలడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, జీపులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
నిర్మల్ జిల్లాలో 32.8 మి.మీ.. వర్షపాతం
నిర్మల్ జిల్లాలో సోమవారం 32.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కుభీర్ మండంలో 70.0మీ.మీ అత్యల్పంగా లోకేశ్వరం మండలంలో 10.2 మి.మీటర్ల వర్షం నమోదైంది. పెంబి మండలంలో 59.5 మిల్లీ మీటర్లు, భైంసా 50.8, సారంగపూర్ 45. దస్తూరబాద్ 43.కుంటాలలో 37.6 మి.మీటర్ల వర్ష పాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దస్తురాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో వర్షం పడడంతో పత్తి, మొక్కజొన్న, పసుపు, మొలకలు, వరి నారుమడుగులకు ఒక్కరిసారిగా జీవం పోసినట్లు అయింది.