ఖానాపూర్ టౌన్, జూలై 4 : ప్రజా సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేశామని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. ఖానాపూర్లోని ఏఎంకే ఫంక్షన్ హాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల ప్రజల నుంచి 73 ఫిర్యాదులు స్వీకరించారు. కలెక్టర్ వారితో మాట్లాడి ఫిర్యాదులను పరిశీలించారు. సమస్యలు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఖానాపూర్లోని 11వ వార్డులో అధిక సమస్యలు ఉన్నట్లు వార్డు ప్రజలు ఫిర్యాదు చేశారు.
పెంబి మండలం నాగపూర్ గ్రామంలోని రావిచెరువులో మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన పనుల్లో కాంట్రాక్టర్ తూము ఏర్పాటు చేయకపోవడంతో పంటలు నష్టపోతున్నట్లు తర్లపాడు గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. తిమ్మాపూర్ ప్రభుత్వ దవాఖాన, బొడ్డొనికుంట, కప్పలకుంట స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని వీడీసీ, గంగపుత్ర సంఘాల సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ నెల 22వ తేదీన ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానలో సదరం శిబిరం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాంబాబు, హేమంత్ బొర్కడే, ఆర్డీవో తుకారాం, జిల్లా, నాలుగు మండలాల అధికారులు పాల్గొన్నారు.
సమస్యలు త్వరగా పరిష్కరించాలి
ఎదులాపురం, జూలై 4 : ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించాలి ఆర్డీవో రాథోడ్ రమేశ్ అధికారులకు సూచించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ధరణి, ఉపాధి, వైద్యం, పింఛన్లు, దళిత బంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ప్రభుత్వ సంక్షేమ వసతి గ్రహాల్లో ప్రవేశాలు, పలు సమస్యలపై వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో డీపీవో శ్రీనివాస్, కలెక్టరేట్ ఏవో అరవింద్ కుమార్, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.