నిర్మల్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : వరిసాగులో వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించే దిశగా నిర్మల్ జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విధానంలో పెట్టుబడి ఖర్చు తగ్గడంతోపాటు నీరు కూడా ఆదా అవుతుంది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 79 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా 61 క్లస్టర్లలో శ్రీకారం చుట్టారు. ప్రతి క్లస్టర్ పరిధిలో 25 మంది రైతులను ఎంపిక చేసి 50 ఎకరాల్లో సాగు చేయనున్నారు. ఈ విధానంలో జిల్లా వ్యాప్తంగా 3,050 ఎకరాల్లో సాగు చేపట్టనుండగా.. సాగుకు ముందుకొచ్చిన రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. జిల్లా పరిధిలో ఈ వానకాలంలో లక్ష ఎకరాల్లో వరిసాగు చేపడుతారని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. యేటా నార్లు పోసి, నాట్లు వేయించడం పద్ధతిలో సాగు చేపడుతుండగా, ఈసారి కొత్త పద్ధతిలో సాగుకు రైతులను సమాయత్తం చేస్తున్నారు.
తగ్గనున్న పెట్టుబడి ఖర్చులు..
వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తే పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఎప్పటిలాగే నాట్లు వేసే పద్ధతిలో ఎకరాకు 25 నుంచి 30 కిలోల విత్తనాలు అవసరమవగా, వెదజల్లే పద్ధతిలో 8 నుంచి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. నాటే ముందు ట్రాక్టర్ కేజ్వీల్తో దమ్ము చేయించే ఖర్చు, నాట్లు వేసేందుకు కూలీల ఖర్చు మిగులుతాయి. దీంతో ఈ విధానంలో ఎకరాకు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని అధికారులు సూచిస్తున్నారు.
ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 61 క్లస్టర్లలో వరి సాగు చేసే రైతులతో వ్యవసాయాధికారులు ఇప్పటికే సమావేశాలు జరిపి, వెదజల్లే విధానంపై శిక్షణనిచ్చారు. కూలీల సమస్య లేకుండానే సమయానుకూలంగా ఈ విధానంలో వరి సాగు చేపట్టవచ్చు. అలాగే 10 రోజుల ముందుగానే ఈ విధానంలో పంట చేతికొస్తుంది. రెండో పంటలు వేసుకునేందుకు కూడా అవకాశం కలుగుతుంది. ఈ విధానంలో 25 నుంచి 30 శాతం వరకు నీటి వాడకం తగ్గుతుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.
మరో మూడు కార్యక్రమాలు…
జిల్లా పరిధిలో ఈసారి వానకాలంలో మరో మూడు కార్యక్రమాల అమలుకు వ్యవసాయాధికారులు కార్యాచరణ రూపొందించారు. జిల్లాలోని 79 క్లస్టర్ల పరిధిలో 3,950 మంది రైతులకు సంబంధించి 7,900 ఎకరాల్లో భాస్వరం కరిగించే బ్యాక్టీరియా వేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక కిలో ఎరువుకు రూ.50 నుంచి రూ.100 చొప్పున ఖర్చవుతుండగా ఒక ఎకరానికి రెండు కిలోల చొప్పున ఈ బ్యాక్టీరియా వేసినట్లయితే ఎకరానికి సగం బస్తా డీఏపీ వాడకం తగ్గించవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. దీంతో ఎకరాకు రూ.600 వరకు రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. దీంతో పాటు పచ్చి రొట్ట ఎరువులైన జనుము, జీలుగ వేయడం పెంచాలన్నది ప్రభుత్వ ఆలోచన. అందుకనుగుణంగా ఈసారి జిల్లాలోని రైతులకు 5 వేల క్వింటాళ్ల జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. 3,450 మంది రైతులతో 45వేల ఎకరాల్లో జీలుగను వేసేలా చర్యలు తీసుకున్నారు.
65 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలను ప్రభుత్వం అందజేస్తున్నది. వరి వేసే ముందు రైతులు ఈ జీలుగను వేయనున్నారు. ఈ విధానంలో రైతులు సాగు చేసిన పంటలకు ఏ దశలో, ఎంత మోతాదులో ఎరువు అవసరమో తెలియజేసి సంబంధిత రైతు ద్వారానే వేయిస్తారు. ఒకేసారి వేయకుండా మొక్కలకు ఏ దశలో ఆహారం అవసరముంటుందనేది తెలియజేసి.. అదే సమయంలో యూరియా, పొటాష్ వంటివి వేయించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా రైతులను ఎంపిక చేసిన అధికారులు పూర్తి స్థాయిలో ఏఈఓల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలను అమలు చేయబోతున్నారు. వీటిలో కొన్నింటిని మండల వ్యవసాయాధికారులు, సహాయ సంచాలకులు, జిల్లా వ్యవసాయాధికారి సైతం పర్యవేక్షించనున్నారు. వెదజల్లే విధానంపై అవగాహన కల్పిస్తున్నామని జిల్లా వ్యవసాయాధికారి అంజి ప్రసాద్ తెలిపారు.
v రెండేళ్లుగా వెదజల్లే పద్ధతిలోనే..
నాకు నిర్మల్ శివారులోని సిద్ధాపూర్లో నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. గత రెండేళ్లుగా వ్యవసాయ అధికారుల సూచన మేరకు నాటు వేసే విధానం కాకుండా వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తున్న. దీని వల్ల ఎకరానికి రూ.5 వేలు నాటు ఖర్చు తగ్గింది. కేజ్వీల్తో దమ్ము కొట్టే అవసరం లేకుండానే ఈ పద్ధతిలో వరి సాగు చేయవచ్చు. దీనివల్ల ట్రాక్టర్ ఖర్చులు కూడా మిగులుతాయి. కేవలం కల్టివేషన్ చేసి వరి విత్తనాలను చల్లాలి. దిగుబడి కూడా ఎకరానికి రెండు క్వింటాళ్లు అధికంగా వస్తున్నది. ప్రభుత్వం వెదజల్లే విధానంలో వరి సాగు చేసే రైతులను ప్రోత్సహిస్తున్నది.
– పిండి శ్రీనివాస్, రైతు, సిద్ధాపూర్