ఎదులాపురం, జూలై 4 : ప్రభుత్వ పాఠశాల ల్లో విద్యాప్రమాణాల పెంపునకు పటిష్ట చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలాస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఎంఈవోలు, పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీ క్షా సమావేశం నిర్వహించారు.
ముందుగా ప్రాథమిక స్థాయిలో విద్యా ప్రమాణాల పెంపునకు చేపట్టవలసిన కార్యాచరణపై శిక్షణ అధికారులు అశోక్, నర్సయ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ జాతీయ సాధన సర్వే ప్రకారం జిల్లాలో చదవులో వెనుకబడిన పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే మర్చిలోగా పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కృషిచేయాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పిల్లల అభ్యాసానికి సంబంధించి రాష్ట్ర, జాతీయ సగటు పనితీరును మెరుగుపర్చడం లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో రూ.5 కోట్లతో విద్యా సమీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. 15వ తేదీలోగా పాఠ్యపుస్తకాలు అందించేలా, పాఠశాలల డేటా ఎంట్రీ ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని సూచించారు. అంతకుముందు ఆదిలాబాద్ రూరల్ మండంలోని ప్రభుత్వ పాఠశాలలను అధికారుల బృందం పరిశీలించింది. విద్యా శాఖ అదనపు డైరెక్టర్ రాజీవ్, రాష్ట్ర ఎల్పీడీ కోర్ కమిటీ సభ్యులు తేజ్బాబు, డీఈవో ప్రణీత, డీఆర్డీవో కిషన్, సెక్టోరల్ అధికారులు నారాయణ, ప్రతాప్, ఐటీడీఏ ఏఎంవో జగన్, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు.