దండేపల్లి, జూలై 3 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపూర్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు పట్టుదలతో చదివి పది ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రైవేటుకు దీటుగా సత్తా చాటారు. మండలంలో తొమ్మిది జడ్పీ ఉన్నత పాఠశాలలు, ఆదర్శ పాఠశాల, కస్తూర్బా విద్యాలయం నుంచి 517 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 487 మంది ఉత్తీర్ణుత సాధించారు. గూడెం జడ్పీ ఉన్నత పాఠశాల, ఆదర్శ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆదర్శ పాఠశాలకు చెందిన 97 మంది విద్యార్థులకు 97 మంది పాసయ్యారు. శ్రీహిత 9.8 జీపీఏ, గూడ ఆశాసైని, స్వాతి 9.7, మనోజ్కుమార్ 9.5 జీపీఏ సాధించి ప్రతిభ కనబర్చారు. అలాగే 16 మంది విద్యార్థులు 9 జీపీఏకి పైగా సాధించారు. 42 మంది విద్యార్థులు మ్యాథ్స్లో 10 జీపీఏ సాధించారు. 2017 నుంచి 2022 వరకు వరుసగా ఐదు సార్లు 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రత్యేక తరగతుల నిర్వహణ
పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేక తరగతుల నిర్వహణతో వెనుకంజలో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించడం, లోపాలను గుర్తించి వాటిని సవరించేలా చర్యలు తీసుకోవడం, రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడం వల్ల వంద శాతం ఫలితాలను సాధించేందుకు దోహదపడుతున్నాయి. కాగా.. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ విషయంలో ఉపాధ్యాయులు సమయానికి రావడం, విద్యార్థులు తరగతులకు సక్రమంగా హాజరయ్యేలా తల్లిదండ్రులు చూడడం, ప్రిన్సిపల్ పర్యవేక్షించడం.. ఈ విధంగా అందరి సహకారంతో మంచి ఫలితాలు సాధిస్తున్నది.
ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతాం..
మా పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించడం ఆనందంగా ఉంది. ఆంగ్ల మాధ్యమం అయినప్పటికీ విద్యార్థులకు అర్థమయ్యేలా బోధిస్తూ వారిలో శ్రద్ధ పెంపొందేలా కృషి చేశాం. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధతోపాటు, ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశాం. అధికారులు అందించిన సమయసారిణి ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాం. ఇప్పటికి వరుసగా 100 శాతం ఫలితాలు సాధించడం మా ఉపాధ్యాయ సిబ్బంది పనితీరుకు నిదర్శనం. భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేస్తాం.
– అనీలా, ప్రిన్సిపాల్
ప్రణాళికలతో చదివాం..
పాఠశాల ప్రారంభం నుంచి మా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించారు. స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థులపై బాగా చదివించారు. ఫలితంగా మాలో మార్పు రావడంతోపాటు మంచి ఫలితాలు సాధించగలిగాం. రోజు ఉదయాన్నే నిద్ర లేపడం, కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత రీడింగ్ చేయించడం, అనంతరం టిఫిన్ చేసిన అనంతరం తరగతులకు వెళ్లేట్టుగా చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వచ్చాయి.
– శ్రీహిత, 9.8 జీపీఏ