కుభీర్, జూలై 3 : మారుతున్న పరిస్థితులు, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులను చైతన్యం చేస్తున్నది. ఈ తరుణంలో పెరుగుతున్న ఆయిల్ ధరలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడే ఆయిల్పామ్ తోటల సాగును ప్రోత్సహిస్తున్నది. ఇందుకోసం మొక్కలను ఉచితంగా అందజేయడంతో పాటు డ్రిప్ సిస్టంను సబ్సిడీపై అందిస్తున్నది. దీంతో సాగుకు జిల్లా రైతాంగం ముందుకొస్తున్నది. ఇప్పటికే జిల్లాలో పలువురు రైతులు ఆయిల్పామ్ సాగు చేపట్టారు.
ఈ ఏడాది లక్ష్యం.. 2వేల ఎకరాలు
ఆయిల్పామ్ సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. జూన్ నాటికి ముథోల్ మండలంలో 103 ఎకరాలు, తానూర్ మండలంలో 18 ఎకరాలు, భైంసా మండలంలో 52 ఎకరాలు, లోకేశ్వరంలో 55ఎకరాలు, కుంటాల మండలంలో 25 ఎకరాలు, కుభీర్ మండలం పార్డి(కే)తో పాటు ఇతర గ్రామాల్లో 20 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు సాగవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 11,400 ఎకరాల్లో సాగు చేసేందుకు జిల్లా ఉద్యానవనశాఖ లక్ష్యంగా నిర్ణయించింది. జూలై నాటికి భైంసా డివిజన్లో మరో 800 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. మిగతా నవంబర్, డిసెంబర్ మాసాల్లో పూర్తి చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం ద్వారా దీనికి అనుమతి సైతం ఇవ్వడంతో ‘ఫ్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ రైతులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
జిల్లా కేంద్రంలోనే ప్రాసెసింగ్ యూనిట్..
సారంగాపూర్ మండలంలోని బీరవెల్లి గ్రామంలో ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ఆయిల్పామ్ మొక్కలను పెంచేందుకు గాను నర్సరీని ఏర్పాటు చేశారు. ఇందులో 4.65 లక్షల మొక్కలు నాటారు. వచ్చే నవంబర్ నుంచి ఈ మొక్కలను రైతులకు అందజేయనున్నారు. ఆసక్తి ఉన్న రైతుల పేర్లను నమోదు చేసేందుకు ఫీల్డ్ ఆఫీసర్లను నియమించారు. రైతులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేయడంతో పాటు పండించిన పంటలను సైతం ఫ్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థనే కొనుగోలు చేసి ప్రాసెసింగ్కు పంపనుంది. దిగుబడులు వచ్చే నాటికి జిల్లా కేంద్రం నిర్మల్లోనే ఈ యూనిట్ను నెలకొల్పనున్నారు.
రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం..
ఆయిల్పామ్ సాగును పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు అందించనున్నది. ఎకరాకు 50 నుంచి 57 మొక్కలు అవసరం కాగా.. ప్రస్తుతం వాటిని పూర్తి ఉచితంగా పంపిణీ చేస్తున్నది. కేవలం మొక్కకు రూ.20 లబ్ధిదారుడి వాటా కింద అందించాల్సి ఉంది. డ్రిప్ సిస్టం కోసం ఓసీ, బీసీలకు 80 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం సబ్సిడీ ఇస్తున్నది. పన్నెండున్నర ఎకరాల వరకు రైతులు రాయితీలు పొందే అవకాశం ఉంది. పంట ఎదుగుదల కాలంలోనూ కొంత నగదును ప్రోత్సాకంగా అందించనున్నది.
తోటల పెంపకంతో అనేక లాభాలు..
మనం పండిస్తున్న నూనె గింజ పంటలతో కేవలం 30 శాతం డిమాండ్ మాత్రమే తీరుతున్నది. మిగతాది విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. విదేశాల నుంచి ది గుమతి చేసుకుంటున్న వ్యవసాయ ఉత్పత్తుల్లో 40శాతం ఆయిల్ ఉండగా.. అందులో 62శాతం పామాయిల్ ఉంటున్నది. ఈ లెక్కన పామాయిల్ సాగు పెంచడంతో చాలా వర కు దిగుమతులు తగ్గించుకునే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగును పెంచే దిశగా చర్యలు చేపట్టింది.
ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం..
ఎకరా భూమిలో 50 మొక్కలు నాటుకోవచ్చు. ఒక్క మొక్క విలువ రూ.193 కాగా.. రైతు తన వాటా కింద కేవలం మొక్కకు రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయిల్పామ్ గెల టన్నుకు రూ.23 వేలు ధర ఉంది. ఎకరా భూమిలో 10 టన్నుల దిగుబడి వచ్చినా రూ.2.30 లక్షల ఆదాయం సమకూరుతుంది. నీరు సమృద్ధిగా ఉన్న సారవంతమైన నేలల్లో ఆయిల్పామ్ సాగు చేస్తే 4 నుంచి 30 ఏళ్ల వరకు నిరంతర ఆదాయం పొందవచ్చు. ఆసక్తి ఉన్న రైతులు ఇప్పటి వరకు 600 ఎకరాల్లో సాగుకు దరఖాస్తు చేసుకోగా, 122 మంది రైతులు 287 ఎకరాల్లో సాగు చేశారు.
– మొయిన్ మియా, ఆయిల్పామ్ క్లస్టర్ ఆఫీసర్, భైంసా
మరిన్ని ప్రోత్సాహకాలు అందించాలి..
నేను ఇటీవలే రెండెకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటా. డ్రిప్ వస్తుందని చెప్పారు. మొక్కలు ఉచితంగా ఇచ్చారు. కానీ నాలు గేండ్ల వరకు పంట చేతికి రాదు. కనుక దిగుబడులు వచ్చే వరకు సంవత్సరానికి కొంత ఆర్థిక సహాయం అందిస్తే మేలు కలుగుతుంది. ఏడాదికి రూ.2 లక్షల ఆదాయం వస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఆయిల్పామ్ రైతులకు అందిస్తున్న ప్రోత్సాహంతోనే యువ రైతులు సాగుకు ముందుకొస్తున్నారు.
– ఆకుల లక్ష్మణ్, రైతు, పార్డి(కే)