కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై వైద్య,ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం కురుస్తున్న వానలతో కుంటలు, చెరువుల్లోకి కొత్త నీరు వచ్చేస్తున్నది. ఇంటి పరిసరాల్లోని గుంతల్లో నీరు చేరి దోమలతో పాటు ఇతర కీటకాలు పెరిగే అవకాశముంటుంది. మలేరియా, ఫైలేరియావంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వ్యాధుల నివారణకు ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా ముందస్తు చర్యలు చేపట్టింది. పల్లెల్లో వ్యాధుల నివారణపై అవగాహన కల్పించడంతో పాటు దోమ తెరల పంపిణీకి సిద్ధమైంది. జిల్లావ్యాప్తంగా 95,540 దోమ తెరలు అందించనున్నది. మరోవైపు 10,980 నివాసాల్లో దోమల నివారణకు స్ప్రే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మలేరియా ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ఇంటింటికీ దోమ తెరలు అందించనున్నారు.
ఏజెన్సీలో తగ్గుతున్న మలేరియా కేసులు
ఏజెన్సీలో గతంతో పోలిస్తే మలేరియా పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో తగ్గుతున్నట్లు తెలుస్తోంది. మలేరియా నివారణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలతో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 12,549 రక్తపూతలను పరీక్షించగా, మలేరియా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. మలేరియా ప్రభావిత గ్రామాల్లో ముందస్తుగా దోమల నివారణ చర్యలు తీసుకోవడంతో మలేరియా ప్రభావం తగ్గినట్లు తెలుస్తోంది. జిల్లాలోని 68 ప్రభావిత గ్రామాల్లో మలేరియా ప్రభావాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. దోమల మందు పిచికారితో పాటు దోమ తెరలను అందించనున్నారు. దీంతో పాటు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా మార్చారు.