ఇంద్రవెల్లి, జూలై 2 : ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజన రైతులను వ్యవసాయ పరంగా మరింతగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గిరి వికాసం పథకాన్ని అమలు చేసిందని ఆదిలాబాద్ డీఆర్డీవో కిషన్, విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తంజాడే అన్నారు. మండలంలోని సమక గ్రామానికి చెందిన 23 మంది రైతులకు ప్రభుత్వం పూర్తి సబ్సిడీపై మంజూరు చేసిన బోర్లను విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తంజాడేతో కలిసి శనివారం పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వం సీఎం గిరి వికాసం పథకం ద్వారా ఆదివాసీ గిరిజన రైతులకు మంజూరు చేస్తున్న విద్యుత్, బోర్వెల్పై అవగాహన కల్పించారు. కొంతమంది రైతులు కసిపి వ్యవసాయ భూముల్లో పూర్తి ఉచితంగా బోర్లు వేసి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తున్నదన్నారు. సమక గ్రామంలో 23మంది రైతులకు రూ.16 లక్షల విలువైన విద్యుత్ బోర్లు వేసి ఆరు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి వ్యవసాయానికి నీటి సౌకర్యం కల్పించిందన్నారు. ఇందులో ఇప్పటికే 10మంది రైతుల వ్యవసాయ భూముల్లో పనులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ శాఖ డీఈ సుభాష్, ఏడీఏ చంద్రశేఖర్, ఏఈ చంద్రశేఖర్, రైతులు పాల్గొన్నారు.
పచ్చటి గ్రామాలుగా తయారు చేయాలి..
నార్నూర్, జూలై 2 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా గ్రామాలను పచ్చగా తీర్చిదిద్దుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్ అన్నారు. మండలంలోని ఖైరదట్వా పంచాయతీలో గాదిగూడ, నార్నూర్ పంచాయతీలకు సంబంధించిన పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో మొక్క నాటారు. ముందు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు.
హరిత తెలంగాణ దిశగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకంతో వాతావరణ కాలుష్యం తగ్గి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుందని తెలిపారు. గిరివికాస్ పథకంపై రైతులకు వివరించారు. ఈ పథకానికి గిరిజన రైతులు అర్హులని పేర్కొన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా బావులున్న రైతులకు సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ముగ్గురు రైతులతో ఓ సంఘం ఏర్పాటు చేస్తామని తెలిపారు. బావులు కలిగిన రైతులను గుర్తించి.. పలు వివరాలు సేకరించారు. అడిషనల్ డీఆర్డీవో రాథోడ్ రవీందర్, సర్పంచ్ కనక సేవంత ప్రభాకర్, ఎంపీడీవో రమేశ్, గాదిగూడ ఎంపీవో షేక్ ఖలీం హైమద్, సిబ్బంది ఉన్నారు.