నిర్మల్ టౌన్, జూలై 2 : బీసీ గురుకులాల్లో నాణ్యమైన విద్య అందించడం వల్లే అడ్మిషన్లలో తీవ్ర పోటీ నెలకొన్నదని బీసీ గురుకులాల ఆర్సీవో గోపిచంద్ అన్నారు. నిర్మల్ పట్టణంలోని దివ్యనగర్ బాలికల మహాత్మా జ్యోతిరావుఫూలే గురుకుల విద్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 24 గురుకులాలున్నాయని తెలిపారు. ఈ ఏడాది నిర్మల్, ముథోల్, ఖానాపూర్ గురుకులాల్లో పదో తరగతి వరకు అప్గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది పదోతరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లాలో 26 మందికి పదికి పది గ్రేడ్లు వచ్చాయని వివరించారు. 6, 7, 8 తరగతులకు తిరిగి ప్రవేశాలను నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసి, పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఆర్సీవో గోపిచంద్ వెంట జిల్లా కన్వీనర్ సంతోష్, ప్రిన్సిపాల్ నందకుమార్ తదితరులు ఉన్నారు.