నిర్మల్ టౌన్, జూన్ 29: వ్యవసాయరంగంలో మరో కొత్త అధ్యాయానికి సర్కారు శ్రీకారం చుడుతున్నది. పంటల పరిశీలన, విత్తనాల పంపిణీ, పెట్టుబడి సాయం, కొనుగోళ్లు, పీఎం కిసాన్, నష్ట పరిహారం, సమావేశాలు, ఫీల్డ్ విజిట్, భూసార పరీక్షలు, అవగాహన వంటి తదితర 12 రకాల సేవలు అందించేందుకు ఏఈవోలకు ఏఈవో యాక్టివిటీ లాగర్ యాప్ను అందుబాటులోకి తేనున్నది. జూలై 5వ తేదీ నుంచి అమలు చేయనుండగా.. సేవలు పారదర్శకంగా అందనున్నాయి. ఈ యాప్ ద్వారా ఏఈవోలు క్షేత్రస్థాయిలో ఎక్కడున్నారో తెలుసుకోవడానికి వీలుంటుంది. ఇంకా.. లొకేషన్ ఫొటోను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యనిస్తున్నది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ యంత్రాంగం అందిస్తున్న సేవల్లో పారదర్శకతకు అడుగులు వేస్తున్నది. ఇందుకోసం ఏఈవో ట్రాక్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది.
వచ్చేనెల 5 నుంచి ఏఈఓలు ఫీల్డ్ విజిట్కు సంబంధించిన ప్రతి అంశాన్ని ఆన్లైన్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతు వేదిక కేంద్రాల ఆధారంగా పని చేస్తున్న ఏఈవోలు భూసారాన్ని మొదలుకొని పంట చేతికొచ్చే వరకు అమలు చేస్తున్న వివిధ పథకాలను క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 305 వ్యవసాయ క్లస్టర్లున్నాయి. నిర్మల్లో 79, ఆదిలాబాద్లో 105, కుమ్రంభీం జిల్లాలో 70, మంచిర్యాల జిల్లాలో 79 క్లస్టర్లుండగా, ఒక్కొక్క క్లస్టర్లో 5వేల ఎకరాల భూమికి ఒక ఏఈవోను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 298 ఏఈవోలు పని చేస్తున్నారు. ప్రస్తుతం రైతు వేదికల ఆధారంగానే ఏఈవోలు తమ దినసరి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాగా ఇకపై వారి సేవలను తెలుసుకునేందుకు ఏఈవో ట్రాక్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది.
పారదర్శకం కానున్న సేవలు…
రైతు వేదిక పరిధిలో రైతులకు ఏ అంశాలకు సంబంధించిన యాక్టివిటీ నిర్వహించినా తప్పనిసరిగా మొబైల్ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందులో సమావేశం, పంటల పరిశీలన, విత్తనాల పంపిణీ, పెట్టుబడి సాయం, పంట కొనుగోళ్లు, పీఎం కిసాన్ పథకం, నష్టపరిహారం, సమావేశాలు, ఫీల్డ్ విజిట్, భూసార పరీక్షలు, రైతులకు ప్రత్యేకమైన అవగాహన, తదితర 12 రకాల సేవలను ఈ యాప్లో ప్రతి రోజూ నమోదు చేయాల్సి ఉంటుంది. మొదటగా ఏఈవో పనిచేసే ప్రదేశంలో రైతువేదిక వద్దకు వెళ్లిన తర్వాతనే యాప్ పనిచేస్తుంది. అక్కడ యాప్ను ఓపెన్ చేసుకొని క్లస్టర్ పరిధిలో ఏ గ్రామానికి వెళ్లినా ఆక్కడి ఫొటో యాప్లో నమోదు చేయాలి. ఇదివరకు వ్యవసాయ విస్తీర్ణాధికారులు రైతు వేదికల వద్దకు వెళ్లి అక్కడే లైవ్ లొకేషన్లో ఫోటో అప్లోడ్ చేసి ఎక్కడికైనా వెళ్లేవారు. ఇప్పుడు ఏ గ్రామంలో ఏ కార్యక్రమంలో ఏఈవో ఉన్నారో ఈ యాప్ ద్వారా జిల్లా అధికారులకు సమాచారం తెలుస్తుంది.
ఈ విధానం ద్వారా రైతులకు మరింత పారదర్శకంగా సేవలు అందే అవకాశం ఉందని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. జులై 5 నుంచి తెలంగాణలోని అన్ని వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో ఏఈవో యాక్టివిటీ లాగర్ యాప్ను అమలు చేసేందుకు ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేక శిక్షణ తరగతులను కూడా నిర్వహించారు. మొదటి విడుత కింద ఒక్కొక్క జిల్లాలో పది మంది ఏఈవోలను ఎంపిక చేసి వారికి యాప్ పనితీరుపై శిక్షణ ఇచ్చారు. వీరంతా కూడా ఆయా జిల్లాల్లో మిగతా వారికి యాప్ పనిచేసే విధానంపై శిక్షణ రెండు రోజుల్లో పూర్తి చేయనుండగా, ఇక ఉమ్మడి జిల్లాలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ యాప్ ద్వారా వ్యవసాయ రంగంలో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాలతోనే అమలు..
ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా జులై 5 నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏఈవోలకు మొబైల్ యాప్ అక్టివిటి లాగర్ యాప్ను అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే ఏఈవోలకు దీనిపై మొదటి విడుత కింద శిక్షణ ఇచ్చాం. ప్రతి ఏఈవో రైతు వేదిక వద్దకు వెళ్లిన తర్వాతే యాప్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఆ క్లస్టర్ పరిధిలో ఎక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా ఫొటో అప్లోడ్, సమయంతో సహా అన్ని వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో ఏఈవోలు క్లస్టర్ పరిధిలో విధుల నిర్వహణ నుంచి తప్పించుకునే అవకాశం లేదు.
– అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి