నిర్మల్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రేషన్ పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులకు ఇక చెక్ పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేండ్లుగా ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ పాస్) ద్వారా బయోమెట్రిక్ పద్ధతిలో రేషన్ సరుకులను అందిస్తున్నది. అయితే, సెల్ ఫోన్ సిగ్నల్ లేకపోవడం.. వేలి ముద్రలు పడకపోవడం.. ఐరిస్ నమోదు కాకపోవడం తదితర సమస్యల కారణంగా లబ్ధిదారులు రెండుమూడు సార్లు దుకాణాలకు వెళ్లాల్సి వస్తున్నది. దాంతో ఇరువైపులా ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో వాటికి పరిష్కారం చూపుతూ ప్రభుత్వం కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. వచ్చే నెల నుంచి దుకాణాల్లో 4జీ సేవల ద్వారా బ్లూటూత్, వైఫైతో పనిచేసే ఈ పాస్ మిషన్లను పూర్తిస్థాయిలో ఉపయోగించనున్నది. దీంతో లబ్ధిదారులకు సత్వరం సరుకులు అందే అవకాశం ఉంటుంది.
ఇబ్బందులను తొలగించేందుకే…
రేషన్ డీలర్ల వద్ద ప్రస్తుతం ఉన్న యంత్రాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. బయోమెట్రిక్ మిషన్కు బ్లూటూత్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. మారుమూల గ్రామాల్లో సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో థంబ్, ఐరిస్ తీసుకునే సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో ఐరిస్ మిషన్లు కూడా పనిచేయడం లేదు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకే ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో 4జీ సదుపాయం ఉన్న ఈ పాస్ మిషన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన 4జీ ఈ-పాస్ యంత్రాలతో థంబ్, ఐరిష్ అత్యంత వేగంగా జరుగుతుందని చెబుతున్నారు. కొత్త మిషన్ల నిర్వహణపై నిర్మల్ జిల్లా అధికారులు రేషన్ డీలర్లకు పూర్తి అవగాహన కల్పించారు. గతంలో కేవలం 2జీ సేవలు మాత్రమే ఉపయోగించగా తాజా యంత్రాలు 4జీ టెక్నాలజీకి అనుగుణంగా అప్గ్రేడ్ చశారు.
జిల్లాలో 412 రేషన్ దుకాణాలు…
నిర్మల్ జిల్లాలో 412 రేషన్ దుకాణాలు ఉన్నాయి. మొత్తం 2,09,881 రేషన్ కార్డులుండగా, వీటిలో అన్నపూర్ణ కార్డులు 35, ఆహార భద్రత కార్డులు 1,97,306, అంత్యోదయ కార్డులు 12,540 ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి నెలా 4,145.270 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేస్తున్నది. ప్రతి ఒక్కరికీ 10 కిలోల చొప్పున 3,706.020 మెట్రిక్ టన్నులు, అంత్యోదయ కార్డులకు 438, అన్నపూర్ణ కార్డులకు 0.350 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నది.
కొత్త యంత్రాల ద్వారా రేషన్ పంపిణీ…
జూలై 1 నుంచే కొత్త ఈ-పాస్ యంత్రాలతో రేషన్ సరుకులను పంపిణీ చేయనున్నాం. జిల్లాలోని 412మంది రేషన్ డీలర్లకు యంత్రాలపై అవగాహన కల్పించి పంపిణీ చేశాం. ఇకపై ఎలాంటి సమస్యలు లేకుండా కొత్త యంత్రాల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ సజావుగా సాగుతుంది. సరుకుల పంపిణీలో అక్రమాలు జరుగకుండా ప్రభుత్వం ఈ-పాస్ మిషన్లను అందజేసింది.
– జే.సుధారాణి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, నిర్మల్