బేల, జూన్ 29 : సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ వనితఠాక్రే అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల దవాఖాన కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బేలలోని దవాఖాన శిథిలావస్థలో ఉందని కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న దృష్టికి తీసుకెళ్లామన్నారు. నూతన దవాఖాన భవనం నిర్మించే వరకు ఐకేపీ కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. త్వరగా దవాఖానను మార్చాలని డాక్టర్ క్రాంతి కుమార్కు సూచించారు. వానకాలం నేపథ్యంలో మండలంలోని గిరిజన గ్రామాల్లో ప్రజలకు ప్రతి రోజూ వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించారు. పారిశుధ్య పనులు చేపట్టాలని అన్నారు. దవాఖానలో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు నిల్వ ఉంచాలని డాక్టర్కు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ బడాల రాంరెడ్డి, సర్పంచ్ ఇంద్రశేఖర్, నాయకులు గంభీర్ ఠాక్రే, ప్రమోద్ రెడ్డి, సతీశ్ పవార్, దేవన్న, మధుకర్, తదితరులు పాల్గొన్నారు.