ఇచ్చోడ, జూన్ 29 : ఆకుపచ్చని తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ప్రతి సంవత్సరం విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ ఏడాది కూడా ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నర్సరీలో మొక్కలు పెంచుతున్నారు. వానకాలం ప్రారంభంలో ఎనిమిదో విడుత హరితహారం కోసం మండలంలోని నర్సరీలు సిద్ధమయ్యాయి. గ్రామాల వారీగా మొక్కలు నాటేందుకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు. మండలంలోని 32 గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీలతో పాటు అటవీ శాఖ అధికారులు వన నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు.
3 లక్షల 40 వేల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు
హరితహారం ద్వారా గ్రామాల్లో మొక్కలు నాటేందుకు అధికారులు ఇప్పటికే స్థలాలను గుర్తించారు. ఒక్కొక్క జీపీతో పాటు దాని పరిధిలో వచ్చే గ్రామాల్లో పది వేల మొక్కలు నాటేందుకు గ్రామ స్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామల్లో విరివిగా పండ్లు, అటవీ జాతుల మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా నర్సరీల్లో గన్నేరు. వెలగ, వేప, రావి, మర్రి, చింత, కానుగ, ఉసిరి, అల్లనేరేడుతో పాటు పండ్లు, పూల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి.
నాటేందుకు మొక్కలు సిద్ధం
ఎనిమిదో విడుత హరితహారంలో భాగంగా నర్సరీల్లో నాటేందుకు మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిసిన తర్వాత ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే గ్రామాల వారీగా మొక్కలు నాటుతాం. మొక్కలు సరిపోనిచో ఇతర నర్సరీల నుంచి మొక్కలు తెప్పించి లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. హరితహారంలో అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములై విజయవంతం చేయాలి. –వామనభట్ల రాంప్రసాద్, ఎంపీడీవో, ఇచ్చోడ