ఇంద్రవెల్లి, జూన్ 29 : మారుమూల గ్రామాల్లో గర్భిణులను గుర్తించి మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ వైద్య సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. వైద్యం కోసం పీహెచ్సీకి వచ్చే రోగుల వివరాల నమోదు, పలు రికార్డులు పరిశీలించారు. గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న వైద్యంపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. పారిశుధ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు వివరించాలని సూచించారు. ఆయన వెంట డీఎంవో శ్రీధర్, డాక్టర్ శ్రీకాంత్, వైద్యసిబ్బంది ఉన్నారు.
ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగేలా చూడాలి
నార్నూర్, జూన్ 29 : ప్రభుత్వ దవాఖానకు వచ్చే ప్రజలకు వైద్యంపై నమ్మకం కలిగేలా చూడాలని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ వైద్య సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని సీహెచ్సీని తనిఖీ చేశారు. దవాఖానకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. దవాఖానలోని గదులు, రోగులకు వైద్యం అందిస్తున్న తీరు, పరిసరాల శుభ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నెలా గర్భిణులకు మెరుగైన వైద్యం అందిస్తూ, మాతాశిశువు ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. ప్రతి గర్భిణి దవాఖానలోనే సాధారణ ప్రసవం పొందేలా చూడాలన్నారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆయన వెంట మెడికల్ అధికారి పవన్కుమార్, వైద్య సిబ్బంది ఉన్నారు.