దస్తురాబాద్, జూన్ 26 : పల్లెల్లో క్రీడా ప్రాంగణాలకు ప్ర భుత్వం పెద్దపీట వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలపై ఆసక్తి పెంపొందించేందుకు ‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంత యువత తో పాటు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని రకాల సౌకర్యాలతో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది. మండలంలో 13 గ్రామ పంచాయతీలుండగా.. 17 గ్రా మాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగా ణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండలంలోని పెర్కపల్లె, రేవోజిపేట గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. మిగతా గ్రామాల్లో పను లు కొనసాగుతున్నాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి ఎకరానికి రూ.4 లక్షల వరకు నిధులు కేటాయించారు. మైదానం విస్తీర్ణాన్ని బట్టి చేసిన పనులకు నిధులు మంజూరు చేయనున్నారు. తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం పేరిట కమాన్ బోర్డును ఏర్పాటు చేశారు. క్రీడా ప్రాంగణంలో ఇనుప పోల్స్, వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో కోర్టులు, లాంగ్, హై జంప్ చేసేలా పరికరాలు ఏర్పాటు చేశారు. దీనికితోడు వ్యాయామ పరికరాలు సైతం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మైదానంలో క్రీడాకారులకు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగేలా మైదానం చుట్టూ మొక్కలు, జెండాలు ఏర్పాటు చేయనున్నారు.
17 క్రీడా మైదానాల ఏర్పాటు..
మండలంలో 17 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం, అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం దస్తురాబాద్, పెర్కపల్లె, రేవోజిపేట, బుట్టాపూర్, ఎర్రగుంట గ్రామాల్లో పనులు పూర్తయ్యాయి. దేవునిగూడెం, మున్యాల, మల్లాపూర్ గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయి. భూత్కుర్ సర్పంచ్ మృతి చెందడంతో స్థలాన్ని ఎంపిక చేయలేదని అధికారులు తెలిపారు. మున్యాల తండా, గొడిసెర్యాల, గొడిసెర్యాల గోండుగూడెం, ఆకొండపేట, రాంపూర్, చెన్నూర్, గోం డుగూడెం (ఆకొండపేట), కొత్త పెద్దూర్ (మున్యాల) గ్రామాల్లో రెవెన్యూ స్థలాలు లేక పనులు ప్రారంభించలేదు. కాగా.. మున్యాల తండా, గొడిసెర్యాల గ్రామాల్లో పనులు కొనసాగుతుండగా.. ‘ఇది మా భూమి’ అని అటవీశాఖ అధికారులు పనులను అడ్డుకున్నారు. దీంతో తాము చేస్తున్న అభివృద్ధి పనులకు అటవీ శాఖ అధికారులు అడ్డు వస్తున్నారని ఎంపీడీవో ఆరోపిస్తున్నారు.
ఈ నెల 30 లోగా పనులు పూర్తి చేయాలి
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 30లోగా గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల పనులను పూర్తి చేయాలి. మండలంలో 13 జీపీలుండగా.. 17 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఐదు గ్రామాల్లో పనులు పూర్తయ్యాయి. క్రీడా ప్రాంగణమని తెలిసేలా కమాన్ ఏర్పాటు చేశాం. మైదానాల్లో ఖో-ఖో, వాలీబాల్, కబడ్డీ కోర్టులు ఏర్పాటు చేశాం. వ్యాయామ పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే నాలుగు గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాం. మిగతా గ్రామాల్లో రెవెన్యూ భూమి లేదు.
– వెంకటేశ్వర్లు, ఎంపీడీవో,దస్తురాబాద్