నిర్మల్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : వానాకాలం సీజన్ నేపథ్యంలో మత్స్యశాఖ అధికారులు ఉచిత చేప పిల్లల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని 19 మండలాల్లో 697 చెరువులు, ఎస్సారెస్పీ, కడెం, స్వర్ణ, గడ్డెన్న వాగు ప్రాజెక్టులు ఉన్నాయి. ఆయా రిజర్వాయర్లు, చెరువుల్లో ఈ ఏడాది వర్షాకాలం 4.98కోట్ల చేప పిల్లల విడుదలకు మత్స్యశాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. వీటికి ప్రభుత్వం ఇటీవల ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు గత మే నెలలో టెండర్లు ఆహ్వానించగా పలువురు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపారు. మే 31న మత్స్యశాఖ అధికారులు ఈ టెండర్ల టెక్నికల్ బిడ్ కూడా తెరిచారు. కాంట్రాక్టర్లు పేర్కొన్న చేపల చెరువులను అధికారులు సందర్శించి క్షేత్ర పరిశీలన చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో ఈ పరిశీలన పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రక్రియను మత్స్యశాఖ అధికారులు వేగవంతం చేశారు.
13,300 కుటుంబాలకు లబ్ధి…
జిల్లా వ్యాప్తంగా 210 మత్స్య సహకార సంఘాలు పని చేస్తున్నాయి. వీటిలో 70 మహిళా సంఘాలు ఉండడం విశేషం. 210 సంఘాల్లో మొత్తం 13,300మంది సభ్యులు ఉండగా, వీరిలో 3,500మంది మహిళలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీతో వారికి ప్రయోజనం కలుగనున్నది. 140 పురుష మత్స్య సహకార సంఘాల్లోని సభ్యులు… 697 చెరువులు, 4 రిజర్వాయర్లలో చేపలు పడుతుండగా వీటిని 70 మహిళా సంఘాల్లోని సభ్యులు కొనుగోలు చేసి మార్కెట్లో అమ్మడం ద్వారా ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో ఎస్సారెస్పీ, స్వర్ణ, కడెం, గడ్డెన్న వాగు ప్రాజెక్టుల్లో ఇప్పటికే ఆశించిన మేర నీటి నిల్వలు ఉండడంతో పాటు, ఆయా రిజర్వాయర్ల కింద గల చెరువులను సైతం పూర్తిస్థాయిలో నింపారు. వరద నీటి చేరిక కూడా ప్రారంభం కానున్నది. రెండు నెలల్లో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ పూర్తి కానుండగా బొచ్చె, రవ్వ, బంగారుతీగ తదతర రకాల పిల్లలు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.
89లక్షల రొయ్య పిల్లల విడుదలకు ప్రణాళిక…
చేపపిల్లల సరఫరా టెండర్ల ప్రక్రియ తుది దశలో ఉండగా, వచ్చే సెప్టెంబర్ మాసంలో ఎంపిక చేసిన చెరువుల్లో రొయ్య పిల్లలను విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా 89లక్షల ఉచిత రొయ్య పిల్లలను విడుదల చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని ఎస్సారెస్పీ, కడెం, గడ్డెన్న వాగు ప్రాజెక్టులతో పాటు భైంసా మండలంలోని కిరాల గ్రామ శివారులో గల రామ సముద్రం చెరువులో రొయ్య పిల్లలను విడుదల చేయనున్నారు. మత్స్యకారులకు ఏటా ప్రభుత్వం చేప పిల్లలతో పాటు, రొయ్య పిల్లలనూ వంద శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నది. ఇలా పెరిగిన మత్స్య సంపదను మత్స్యకారులు మార్కెట్లో విక్రయించడం ద్వారా ఆదాయం పొందుతున్నారు. చేపల రవాణా, అమ్మకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాహనాలు సమకూర్చుతున్నది. ప్రధానంగా ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్య సంపద గణనీయంగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తుండడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మత్స్యకారులకు అండగా ప్రభుత్వం…
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను, రొయ్య పిల్లలను అందజేస్తూ అండగా నిలుస్తున్నది. మత్స్యకారులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వమే ప్రమాద బీమా సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నది. ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5లక్షల బీమాతో పాటు మరో రూ.4లక్షల ఎక్స్గ్రేషియాను అందజేస్తున్నది. అలాగే సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద మత్స్యకారులకు టూ వీలర్స్, ఫోర్ వీలర్స్, ఇన్సులేటెడ్ వాహనాలు, వలలు, సంచార చేపల విక్రయ వాహనాలను ఇప్పటికే అందించింది. – బీ నరసింహారావు, జిల్లా మత్స్య శాఖ అధికారి, నిర్మల్