ఎదులాపురం, జూన్ 25 : చిన్నారుల్లో వచ్చే గుండె సంబంధిత వ్యాధులను గుర్తించి తమ దవాఖానలోనే ఉచితంగా శస్త్ర చికిత్స చేయిస్తామని కేర్ దవాఖాన కార్డియాలజిస్ట్ డాక్టర్ చింతల కవిత అన్నారు. ఆదిలాబాద్లోని రిమ్స్ పాత ఓపీ భవనం రెండో అంతస్తులోని డైస్ కేంద్రంలో శనివారం పిల్లల గుండె సంబంధిత ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. దీనికి అనూహ్య స్పందన లభించింది. హైదరాబాద్ కేర్ దవాఖానకు చెందిన పీడియాట్రిక్ కార్డియాలజిస్టు వైద్యులు చిన్నారులకు వైద్యపరీక్షలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి రిమ్స్కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. గుండె సంబంధిత వ్యాధుల్లో కొంత మందికి సాధారణ వైద్యంతోనే నయమవుతుందన్నారు. మరి కొందరికి శస్త్ర చికిత్స చేయడంతో తగ్గుతుందని తెలిపారు. అనంతరం డీఐవో, ఆర్బీఎస్కే కోఆర్డినేటర్ వైసీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహించే ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్లో శస్త్ర చికిత్స కోసం ఆదిలాబాద్ నుంచి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి తీసుకెళ్లి చికిత్స చేయించి తిరిగి చేరవేస్తామన్నారు. కేర్ దవాఖాన వైద్యురాలు దీప, డైస్ మేనేజర్ జైవింద్ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.