ఆసిఫాబాద టౌన్,జూన్ 25 : సర్కారు స్కూళ్లలో నాణ్యమైన విద్యనందించాలని కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో ప్రభత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యనందించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. జిల్లాలోని 246 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, వీటిలోని వంద పాఠశాలల్లో అత్యవసర మౌలిక వసతులు అవసరం ఉన్నవి గుర్తించి వెంటనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా నల్లా కనెక్షన్ అందించాలన్నారు. విద్యుత్ సరఫరా, ప్రహరీల నిర్మాణం, తాగు నీటి సౌకర్యం శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ ఉపాధి హామీ కింద జిల్లాలో అవసరం ఉన్న పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు పనులను నిర్వహించాలన్నారు. జూలై 7 నాటికి అన్ని ఆదర్శ పాఠశాలలను పూర్తి హంగులతో సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు.