ఆదిలాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో నల్లమట్టి దందా జోరుగా సాగుతున్నది. కొందరు వ్యాపారులు చెరువుల నుంచి మట్టి తవ్వకాలను అక్రమంగా చేపడుతూ రహస్య ప్రదేశాల్లో కుప్పలుగా పోస్తున్నారు. అక్కడి నుంచి నిశీధి వేళ తరలిస్తూ సొమ్ము చేసుకుం టున్నారు. చెరువుల మధ్య కాకుండా చుట్టూ పక్కల తవ్వకాలు చేపడుతుం డడంతో పెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. ఈ వానకాలంలో చెరువులు నిండుతాయి. నీరు తాగడానికి పశువులు, సాగు నీటికి మనుషులు చెరువుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండగా.. తవ్వకాలను నిలిపివే యాలని స్థానికులు కోరుతున్నారు. చెరువుల నుంచి మట్టిని తరలించడానికి అనుమతులు లేవని, అక్రమంగా తవ్వకాలు చేపడితే నోటీసులు జారీ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్లోని 28వ వార్డులో మురుగు కాలువను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ జిల్లాలో ఇరిగేషన్ శాఖ పరిధిలో 458 చెరువులు ఉన్నాయి. మిషన్ భగీరథ పథకంలో భాగంగా 218 చెరువులకు మరమ్మతు చేశారు. దీంతో చెరువుల పరిధిలో రెండు పంటలకు నీరందుతున్నది. సీజన్లో జిల్లా వ్యాప్తంగా 1,400 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవుతున్నది. దీంతో చెరువుల్లో నీరు పుష్కలంగా ఉంటున్నది. ప్రభుత్వం అందిస్తున్న సాయంతో మత్స్యకారులకు సైతం చెరువుల్లో చేప పిల్లలను పెంచుతూ ఉపాధి పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఏటా ఏప్రిల్, మే నెలల్లో చెరువుల్లో నీటిమట్టం తగ్గిపోవడంతో కొందరు ఇటుకల వ్యాపారులు అనుమతి లేకుండా తవ్వకాలను సాగిస్తున్నారు. ఇటుకల తయారీకి ఉపయోగించే నల్లమట్టి కోసం ఇష్టానుసారంగా జేసీబీలతో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. రైతులు తమ పొలాలకు వెళ్లే దారులకు సమీపంలో పెద్ద, పెద్ద గుంతలు తవ్వుతున్నారు. టిప్పర్ల సాయంతో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. చెరువు గట్లు, చెట్లను సైతం నరికివేస్తూ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.
తవ్వకాలతో ప్రమాదాలు
వ్యాపారులు చెరువుల మధ్యలో కాకుండా చుట్టూ తవ్వకాలు సాగిస్తున్నారు. అక్రమ తవ్వకాల కారణంగా 3 నుంచి 4 మీటర్ల లొందలు ఏర్పడుతున్నాయి. స్థానికులు తమ అవసరాలకు, పశువులకు నీరు తాగించడానికి, ఈతకు వెళ్లినప్పుడు లొందల్లో నీళ్లు నిండి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. జిల్లాలో గతంలో పలు చెరువుల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. కొందరు వ్యాపారులు తెలివిని ప్రదర్శిస్తూ మట్టిని రైతుల పొలాల్లో వేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రి సమయాల్లో టిప్పర్ల ద్వారా తమ స్థలాలకు తరలిస్తున్నారు. ఈ విషయంలో వ్యాపారులు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను మచ్చిక చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఇరిగేషన్ అధికారులు సైతం తవ్వకాల గురించి పట్టించుకోకపోవడంతో వ్యాపారుల దందాకు అడ్డుకట్ట లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తవ్వకాలను నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం..
చెరువుల్లో అక్రమ తవ్వకాలపై సంబంధింత మండలాల ఇంజినీర్లు, సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తాం. చెరువుల నుంచి నల్లమట్టిని తరలించడానికి అనుమతుల్లేవు. తవ్వకాల వల్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడితే ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి. అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి నోటీసులు జారీ చేస్తాం.
– రాథోడ్ విఠల్, ఈఈ, ఇరిగేషన్, ఆదిలాబాద్