సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న కార్మిక, కార్మికేతర కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి, నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం 2,242 మందికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే దివాకర్రావు పట్టాలను పంపిణీ చేశారు. పట్టాలు అందుకున్న వారి కుటుంబాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. లబ్ధిదారులు ఇళ్ల ఎదుట మామిడితోరణాలు, రంగవల్లులు వేయడంతో పండుగ వాతావరణం కనిపించింది. ఇంటిల్లిపాది వీధుల్లోకి వచ్చి పటాకులు కాల్చడంతో దీపావళి వచ్చినట్టు కనిపించింది. మిఠాయిలు పంచుకొని ఆటపాటలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియం, రామకృష్ణాపూర్లోని సూపర్ బజార్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి, విప్ మాట్లాడారు. సింగరేణి స్థలాల క్రమబద్ధీకరణతో సర్వహక్కులూ వచ్చాయని, మిగతా వారికి కూడా త్వరలోనే పట్టాలు అందిస్తామని పేర్కొన్నారు.
– శ్రీరాంపూర్/రామకృష్ణాపూర్, మే 25
శ్రీరాంపూర్/రామకృష్ణాపూర్, మే 25 : నస్పూర్, క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కార్మిక, కార్మికేతర కుటుంబాలకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు పట్టాలు పంపిణీ చేశారు. బుధవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియం, రామకృష్ణాపూర్లోని సూపర్ బజార్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో 2242 మందికి పట్టాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
సింగరేణి స్థలాల క్రమబద్ధీకరణతో సర్వహక్కులు : మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
సింగరేణి శ్రమజీవుల సంక్షేమం దిశగా రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నదని, తెలంగాణ వచ్చాకే కార్మికుల కష్టాలు తొలిగాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. సింగరేణి స్థలాల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న కార్మిక, కార్మికేతర కుటుంబాలకు స్థలాలను క్రమబద్ధీకరించి సర్వ హక్కులు కల్పించడం సంతోషంగా ఉందన్నారు. 2018 టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని 24 అంశాలలో 23వ అంశమైన సింగరేణి స్థలాల క్రమబద్ధీకరణ విషయాన్ని ఆచరణలోకి తీసుకురావడంలో టీఆర్ఎస్ పూర్తిస్థాయిలో విజయవంతమైందన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని 176 ఎకరాల సింగరేణి స్థలంలో దాదాపు 2,843 మంది కార్మిక, కార్మికేతర కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేయడం జరుగుతున్నదని పేర్కొన్నారు. ఇక నుంచి లబ్ధిదారులకు భూమిపై పూర్తి హక్కులు కల్పించడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా శ్రీరాంపూర్ ఏరియాలోని అరుణక్కనగర్, సుందరయ్య కాలనీ, ఆర్కే-6 గుడిసెలు, వాటర్ ట్యాంక్ ఏరియావాసులకు పట్టాలు ఇచ్చామని తెలిపారు. ఓట్ల కోసమే కాంగ్రెస్, బీజేపీ నాయకులు రచ్చబండ, పాదయాత్రలు అంటు దొంగ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ సింగరేణి ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే మొదటి విడుతగా సింగరేణి స్థలాలలో సొంత ఇండ్లు నిర్మించుకున్న 2,242 కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.
రామకృష్ణాపూర్ అస్తత్వం, పునరుజ్జీవమే లక్ష్యం : ప్రభుత్వ విప్ బాల్క సుమన్
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణపూర్ అస్తిత్వం, పునరుజ్జీవమే నా లక్ష్యమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఆరు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలకు ఇండ్ల పట్టాలు ఇప్పించాలనే ఆలోచన రాకపోవడం దురదృష్టకరం. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు జీవో 76ను తీసుకొచ్చి ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఒకడు కులం పేరుతో, మరొకడు మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ తన సొంత ఊరు అని, ఇక్కడే ఇల్లు కట్టానని తాను మరణించేంత వరకు చెన్నూర్ అభివృద్ధికి అహర్నిశలు పాటు పడతానని పేర్కొన్నారు. సింగరేణిలో జాతీయ సంఘాల నిర్లక్ష్యం వల్లే కార్మికుల హక్కులు హరించబడ్డాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కార్మికుల సంక్షేమం, సంస్థ పరిరక్షణకు కృషి చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగానే జాతీయ యూనియన్లు రద్దు చేయించిన వారసత్వ ఉద్యోగాలను, తిరిగి అమలు చేస్తున్నాడని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం కొన్ని ప్రాంతాలను ప్రభుత్వానికి అప్పగించలేదని క్వార్టర్ల మధ్యలో సొంత ఇండ్లు నిర్మించుకున్న వారికి కూడా పట్టాలను అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సభలో కొంతమందికి మాత్రమే పట్టాలను పంపిణీ చేస్తున్నామని, గురువారం నుంచి మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో అవకతవకలకు తావు లేకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ పారదర్శకంగా పట్టాలను అందించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శం : దివాకర్రావు, ఎమ్మెల్యే మంచిర్యాల.
పట్టాలతో మీ భూములకు అధిక ధరలు పలుకుతాయని ఎమ్మెల్యే దివాకర్రావు తెలిపారు. తెలంగాణా రాష్ట్రం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉందని, అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉందన్నారు. కలెక్టర్ భారతీ హోళికేరి మాట్లాడుతూ.. 76 జీవో ప్రకారం 176 ఎకరాల సింగరేణి భూమి ప్రభుత్వానికి అప్పగించడం వల్ల నివాసులకు పట్టాలు ఇవ్వడం జరుగుతున్నదని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారందరూ సకాలంలో రిజిష్ట్రేషన్ చేయించు కోవాలని సూచించారు. ఈ సమావేశాల్లో నస్పూర్, క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్స్ ప్రభాకర్, జంగం కళ, వైస్ చైర్మన్స్ శ్రీనివాస్, సాగర్రెడిచ శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు సురేందర్రెడ్డి, అన్నయ్య, మల్లారెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిది ఏనుగు రవిందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భూమేశ్, క్యాతన్పల్లి కమిషనర్ వెంకటనారాయణ, జడ్పీటీసీ వేల్పుల రవి, తహశీల్దార్ శ్రీనివాస్, కౌన్సిలర్లు పద్మ, లక్ష్మి, బౌతు లక్ష్మి, చీడం మహేశ్, కుమార్, హైమద్, నాసర్, గంగా ఎర్రయ్య, దాసు, సత్యనారాయణ, తిరుపతి, మొగిళి, పట్టణ అధ్యక్షుడు సుబ్బయ్య, టీఆర్ఎస్ నాయకులు విజిత్రావు, రాజేంద్రపాణి, జక్కుల రాజేశం, గురువయ్య, గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకూబ్ అలీ, రామిడి కుమార్, గడ్డం రాజు, జాడి శ్రీనివాస్, గడ్డం సంపత్, రేవెళ్లి ఓదెలు, పుల్లూరి సుధాకర్ పాల్గొన్నారు.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం..
రామకృష్ణాపూర్, మే 25 : సొంత ఇంటడుగు జాగ లేక సింగరేణి భూమిలో గుడిసెలు నిర్మించుకొని చాలా ఇబ్బందులువడ్డం. సింగరేణి ప్రాంతంలో ఇండ్లు కట్టుకున్న మాకు ఇండ్ల పట్టాలు ఇప్పిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. 50 ఏడ్ల సంది మమ్ములను పట్టింపకున్న నాయకుడు లేడు. కార్మిక కుటుంబాల గోస తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్ సారే. మా బాధలను గుర్తించి రాష్ట్రం ఏర్పడిన తర్వాత శ్రీరాంపూర్లో నిర్వహించిన సింగరేణి కార్మికుల ఆత్మీయ సభలో ఇండ్ల పట్టాలు ఇప్పిస్తామని చెప్పిన మాట నిలుపుకున్నడు. ఇక ముందు కూడా ఆయన చూపిన బాటలోనే మా ప్రయాణం.
– బొడ్డున సత్తమ్మ,ఇందిరానగర్, రామకృష్ణాపూర్
దశాబ్దాల కళ నెరవేరింది..
రామకృష్ణాపూర్, మే 25 : ఐదు దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న కళ సీఎం కేసీఆర్ ఆదేశాలు, ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కృషి పట్టుదలతో నెరవేరింది. పొట్టచేత పట్టుకొని బొగ్గుబాయి పనికి వచ్చి సింగరేణిలో దశాబ్దాల కాలంగా రేకుల షెడ్లు నిర్మించుకొని జీవిస్తున్న మాకు కేసీఆర్ సారు ఇండ్ల పట్టాలు ఇప్పించి దేవుడయ్యాడు. పట్టాలు రావడం సంతోషంగా ఉంది. సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న మాకు ఇండ్ల పట్టాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విప్ బాల్క సుమన్కు ధన్యవాదాలు, కృతజ్ఞతలు.
– నిట్టూరి దేవదాసు, రాంనగర్, రామకృష్ణాపూర్
గత ప్రభుత్వాలు పట్టించుకోలే..
రామకృష్ణాపూర్, మే 25 : గత ప్రభుత్వాలు మమ్మల్ని, మా గోసను ఎన్నడూ పట్టించుకోలే. 30 ఏండ్లుగా సింగరేణి స్థలంలో మొదట గుడిసె వేసుకున్నాం. కాలక్రమంలో రేకుల షెడ్డు నిర్మించుకున్నాం. గత ప్రభుత్వాలు మా ఇండ్లకు పట్టాలు ఇచ్చి ఉంటే పక్కా ఇండ్లు నిర్మించుకునేవాళ్లం. ప్రభుత్వ ఇండ్ల కోసం ఎదురు చూసే వాళ్లం కాదు. ఇప్పడు కేసీఆర్ ప్రభుత్వం ఇడ్ల పట్టాలు పంపిణీ చేసింది. మేము స్లాబ్ పోసుకొని ఇల్లు కట్టుకునే అవకాశం వచ్చింది. సీఎం సారు మా సంక్షేమం కోసం ఆలోచించడం అదృష్టంగా భావిస్తాం. మా ఇండ్లకు పట్టాలు రావడంతో మాకు ఆత్మగౌరం పెరిగింది.
– లింగంపల్లి లక్ష్మి, జ్యోతినగర్, రామకృష్ణాపూర్
అదనంగా గదులు కట్టుకుంటం..
శ్రీరాంపూర్, మే 25 : శ్రీరాంపూర్ అరునక్కనగర్ ఆర్కే-8 కాలనీలోని సింగరేణి స్థలంలో 30 ఏండ్లుగా నివాసం ఉంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ దయ, మా ఎమ్మెల్యే దివాకర్రావు సారు కృషితోనే మాకు పట్టాలు వచ్చాయి. పట్టా వచ్చింది కాబట్టి ఇక అదనంగా గదులు నిర్మించుకుంటాం.
– శుంకి శశికళ, అరునక్కనగర్, శ్రీరాంపూర్
కేసీఆర్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు..
రామకృష్ణాపూర్, మే 25 : 30 ఏండ్లుగా ఇండ్లు నిర్మించుకొని ఉంటున్న మాకు ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రత్యేక చొరవతో ఇండ్ల పట్టాలు ఇప్పించడం చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వాలు, పాలకులు ఇండ్ల పట్టాల గురించి పట్టించుకోనేలేదు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సారు ఇక్కడి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 76 జీవో ప్రకారం ఇండ్ల పట్టాల పంపిణీ చేశారు. దీంతో చాలా మందికి మేలు కలుగుతుంది. రేకుల షేడ్ల స్థానంలో పక్కా ఇల్లు కట్టుకునే అవకాశం లభించింది. సింగరేణి ప్రాంతంలోని కార్మిక కుటుంబాలు కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం.
– ఉప్పారపు పోచయ్య, రాంనగర్, రామకృష్ణాపూర్
పక్కా ఇల్లు కట్టుకుంటాం..
శ్రీరాంపూర్, మే 25 : ఇండ్ల స్థలాలకు పట్టాలు వచ్చాయి. చాలా ఆనందంగా ఉంది. ఇంత కాలం నివాసం ఉంటున్నట్లే గానీ పర్మినెంట్ స్థలం కాదనే భావన మమ్ములను చాలా బాధపెట్టేది. మాకు అందిన పట్టాతోటి ఇప్పుడు మా సొంత స్థలంగా భావిస్తాం. ఆ జాగల ఇక పక్కా ఇల్లు కట్టుకుంటాం. ఇక సింగరేణి యాజమాన్యం వేదింపులు ఉండవు. సీఎం కేసీఆర్ సారు, మా ఎమ్మెల్యే దివాకర్రావుకు ధన్యవాదాలు.
– చుంచు జ్యోతి, వాటర్ ట్యాంక్ ఏరియా, శ్రీరాంపూర్