నార్నూర్, మే 25 : ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం కార్యరూపం దాల్చుతున్నది. ప్రతి మండలంలో కొన్ని పాఠశాలలను తొలి విడుతలో ఎంపిక చేశారు. ప్రభుత్వం ఈ పథకానికి నిధులు మంజూరు చేయడంతో కొన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయి. ఈ నిధులతో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అన్ని వసతులు సమకూరనున్నాయి. ఎస్ఎంసీల ఆధ్వర్యంలో ఈ పనులు నిర్వహిస్తున్నారు.
నార్నూర్, గాదిగూడ మండలాల్లో ఈ పథకంలో 8 పాఠశాలలు ఎంపికయ్యాయి. మరమ్మతు పనులకు రూ.2కోట్లు మంజూరయ్యాయి. ఈ పనుల పర్యవేక్షణను సమగ్ర గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ అధికారులకు అప్పగించింది. ప్రతి పాఠశాలలో పనులు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ నార్నూర్లోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో పనులు ప్రారంభించారు. మరమ్మతులను ఎప్పటికప్పుడు దగ్గరుండి పరిశీలించేందుకు అధికారులు మండల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో పర్యవేక్షణకు మండల స్థాయిలో ఎంఈవో, ఎంపీడీవో, మండల ప్రత్యేకాధికారి, సర్పంచ్, ప్రధానోపాధ్యాయుడు, ఎస్ఎంసీ చైర్మన్లు ఉంటారు. అన్ని పాఠశాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేసి పనులు ప్రారంభించనున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు.
మంజూరైన నిధులు ఇలా..
అర్జుని(ఎంపీపీఎస్)కు రూ.10,480,38, కొలామా(జీ)కి రూ.4,10,558, కొలామా(ఎస్సీగూడ)కు రూ.19,47,607, మేడిగూడకు రూ.9,32,543, పర్సువాడ(కే)కు రూ.16,26, 293, రూప్పాపూర్(ఎస్సీగూడ)కు రూ.3,89,308, లోకారి(బీ)కి రూ.8,82,522, గుంజాలకు రూ.3,87,282, ఖంపూర్కు రూ.6,63,987, కొత్తపల్లి(హెచ్)కి రూ.8,03048, మహార్గూడకు రూ.20,29,334, మలేపూర్కి రూ .4,40001, నార్నూర్ ఎంపీపీఎస్కు రూ.6,85,118, నార్నూర్ ఎస్సీకాలనీకి రూ.8,65,444, నార్నూర్ ఉర్దూ పాఠశాలకు రూ.2,41,245, తాడిహత్నూర్(ఎస్సీ)కి రూ.9,97, 943, తాడిహత్నూర్కు రూ.20,54,750, నార్నూర్ జిల్లా పరిషత్ పాఠశాలకు రూ.29,35,527 మంజూరయ్యాయని అధికారులు వెల్లడించారు.
పూర్తి స్థాయిలో వసతులు కల్పిస్తాం
మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ఎంపికైనా పాఠశాలలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నిధులు సక్రమంగా సద్వినియోగం చేస్తూ పాఠశాల్లో పూర్తి స్థ్థాయిలో మౌలిక వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటాం. త్వరలోనే ప్రతి పాఠశాలలో పనులు ప్రారంభిస్తాం.
-రాథోడ్ సునీల్, ఏఈ, ఐటీడీఏ