బోథ్, మే 22 : బోథ్ మండలంలోని పొచ్చెర క్రాస్రోడ్డు సమీపంలో ఆదివారం అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కాను పట్టుకున్నట్లు ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్రావు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పొచ్చెర క్రాస్రోడ్డు వద్ద బోథ్ సీఐ ముదావత్ నైలు, కేంద్రె రవీందర్ వాహనాల తనిఖీ చేపడుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఐచర్ వాహన డ్రైవర్ ఆపకుండా బోథ్-కిన్వట్ రోడ్డుపై వేగంగా వెళ్లాడని, దీంతో పోలీసులు వెంబడించారన్నారు. కన్గుట్ట గ్రామ సమీపంలో పట్టుకున్నారని తెలిపారు. వాహనంలోని బస్తాలను పరిశీలించగా, నిషేధిత గుట్కా, తంబాకు ఉన్నట్లుగా గుర్తించామన్నారు.
ఐచర్ను పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి సంచులను పూర్తిగా తెరిచి చూసినట్లు చెప్పారు. అందులో సుమారు రూ.14.36 లక్షల విలువైన గుట్కా ఉన్నట్లు నిర్దారించామన్నారు. వాహన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. ఆ గుట్కా ఆదిలాబాద్లోని అస్లాం ట్రేడర్స్కు చెందినదిగా గుర్తించామని, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి తరలిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్దారించామని వెల్లడించారు. ఇప్పటికే అస్లాం ట్రేడర్స్పై 30 వరకు కేసులు నమోదై ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గుట్కాను చాకచక్యంగా పట్టుకున్న బోథ్ సీఐ, ఎస్ఐ, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.