ఆసిఫాబాద్, మే 10 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారి సమస్యలకు పరిష్కారం లభించనుంది. జిల్లా పర్యటన సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి తన్నీర్ హరీశ్రావును జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప డయాలసిస్ కేంద్రాలు లేకపోవడంతో 100 మందికి పైగా కిడ్నీ వ్యాధి గ్రస్తులు మంచిర్యాల, ఉట్నూర్, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరడంతో జిల్లాకు రెండు డయాలసిస్ సెంటర్స్ మంజూరు చేశారు. దీంతో కాగజ్నగర్, ఆసిఫాబాద్ ప్రాంతంలోని వ్యాధిగ్రస్తుల ఇబ్బందులు దూరం కానున్నాయి. కేంద్రాల ఏర్పాటుకు అధికారులు పనులు చేపడుతుండగా.. పనులు పూర్తిస్థాయికి చేరాయి.
వ్యాధిగ్రస్తులకు తీరనున్న కష్టాలు
ఒక్కోసారి డయాలసిస్ చేయాలంటే సుమారు రూ.5 వేల నుంచి రూ.7 వేలు ఖర్చవుతాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రోజు తప్పిచ్చి రోజు, మరికొంత మంది వారానికి ఒక్కసారి, ఇంకొంత మంది రోజూ డయాలసిస్ చేయించికోవాలి. దీంతో నిరుపేదలైన రోగులు ఆర్థికంగా సతమతవుతున్నారు. జిల్లాలో రెండు డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుతో ఉచిత సేవలు అందించడంతోపాటు వారికి ఆర్థికంగానూ కలిసివస్తుంది.
అందరికీ వైద్యం అందించడమే లక్ష్యం
గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు అన్ని విధాలా వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నం. దశలవారీగా వైద్య సేవలు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాకు ఇప్పటికే 340 పడకల దవాఖాన మంజూరైంది. దీంతో పిల్లల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశాం. త్వరలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ ఇక్కడే జరుగుతుంది.
– ఆత్రం సక్కు, ఎమ్మెల్యే, ఆసిఫాబాద్.