ఎదులాపురం,మే10: ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతులు పాటించి లాభదాయక పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ వ్యవసాయ అధికారులను అదేశించారు.2022 సంవత్సరానికి గాను వానకాలం పంటల సాగు యాజమాన్య పద్ధతులపై మావల మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా వ్యవసాయ,ఉద్యానవన, ఆత్మ అధికారులు, శాస్త్రవేత్తలు పత్తి, సోయా, శనగ, ఆయిల్ పాం, కంది, తదితర పంట ల సాగుకు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడారు.
ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడి సాధించేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. నకిలీ విత్తనాలతో నష్టపోకుండా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏఈవోలు రైతు వేదికల నుంచి విధులు నిర్వహించాలని ఆదేశించారు.గ్రామాల వారీగా రైతుల వివరాలు, ఆధునిక వ్యవసాయం, ఎరువుల వినియోగం, ఉద్యానవన పంటల సాగు వివరాలను రైతువేదికల్లో ప్రదర్శించాలని సూచించారు.జిల్లాలో 2022-23కు గాను వానకాలంలో 1200 ఎకరాలు, యాసంగిలో 2200 ఆయిల్ పాం సాగు చేయాలని నిర్దేశించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం సబ్సిడీ, మిగతా రైతులకు 90 శాతం సబ్సిడీతో ఆయిల్పాం మొక్కల సరఫరా, డ్రిప్, తదితర సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. పంట రుణాల మంజూరుపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఎల్డీఎం చంద్రశేఖర్, వ్యవసాయ అధికారులు, రైతులు, పాల్గొన్నారు.
నర్సరీ సందర్శన
జిల్లా కేంద్రంలోని దుర్గానగర్ అటవీ శాఖ నర్సరీని కలెక్టర్ మంగళవారం సందర్శించారు. నర్సరీ విస్తీర్ణం, మొక్కల పెంప కం, ఎరువుల తయారీ తదితర అంశాలను జిల్లా అటవీ శాఖ అధికారిని అడిగి తెలుసుకున్నారు. నర్సరీల్లో పెంచుతున్న పెద్ద మొక్కలు అటవీ క్షేత్రాలతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో నాటాలని సూచించారు.నర్సరీలలో పెంచుతున్న మొక్కలు, సేంద్రియ ఎరువుల తయారీ అంశాలపై ఎండీపీవోలకు శిక్షణ ఇవ్వాలని డీఎఫ్వోకు సూచించారు. అంతరించి పోతున్న అటవీ జాతి మొక్కలను సేకరించి పునరుద్ధరిస్తున్నామని డీఎఫ్వో రాజశేఖర్ కలెక్టర్కు వివరించారు. బండ జున్వి మొక్కలను లేత్ హౌస్లో పెంచి, వాటిని వివిధ ప్రాంతాలకు పంపిస్తున్నామనిచెప్పారు. సుమారు పదెకరాల విస్తీర్ణంలో సుమారు ఆరు లక్షల వివిధ రకాల మొక్కల పెంపకం చేపడుతున్నామని వెల్లడించారు. అనంతరం ఆదిలాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మియావాకీ ప్లాంటేషన్ను సందర్శించారు. ఆమె వెంట అటవీ రేంజ్ అధికారి గులాబ్సింగ్, అటవీ శాఖ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
పాఠశాలల్లో పనులు ప్రారంభించాలి
మన ఊరు-మన బడి కార్యక్రమం పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మన ఊరు- మన బడి కార్యక్రమం పనులపై మంగళవారం అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో రెండు, మూడు రోజుల్లో పనులు ప్రారంభించాలని,ఇప్పటికే పరిపాలన అనుమతులు ఇచ్చామని చెప్పారు. ఇంజినీరింగ్ అధికారుల అంచనా ప్రకారం 10 శాతం అడ్వాన్స్ చెల్లించనున్నట్లు తెలిపారు. ఏజె న్సీ ఇంజినీరింగ్ అధికారులు ఆయా పాఠశాలలను బుధవారం సందర్శించి పనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 15 నాటికి పాఠశాలల్లో పనులను గ్రౌండింగ్ అదనపు కలెక్టర్ సూచించారు. ఇప్పటి వరకు 34 పాఠశాలలకు గాను 20 పాఠశాలకు పది శాతం అడ్వాన్స్ మంజూరు చేశామని తెలిపారు. ఉపాధి హామీ కింద పాఠశాలల్లో చేపట్టే మరుగుదొడ్లు , ప్రహరీ, కిచెన్షెడ్ నిర్మాణాలకు అంచనాలు సమర్పించాలన్నారు. సమావేశంలో డీఈవో ప్రణీత, పంచాయతీరాజ్ ఈఈ మహావీర్, పాఠశాలల కమిటీ చైర్మన్లు, హెచ్ఎంలు, ప్రత్యేక అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.