నిర్మల్ టౌన్, మే 10 : నిర్మల్ జిల్లాలో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. వ్యవసాయ సీజన్ ముగియడంతో ఉపాధి లేని వారికి పనులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అన్ని గ్రామాల్లో ఉపాధిహామీ పనులను పెద్ద ఎత్తున చేపడుతున్నది. జిల్లాలో 1,62,718 మందికి ఈజీఎస్ జాబ్కార్డులుండగా.. సుమారు 3 లక్షల కుటుంబాలు పనులు చేయాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాలో సోమవారం నాటికి 1,05,019 మంది పనులకు వచ్చినట్లు డీఆర్డీవో విజయలక్ష్మి తెలిపారు. జిల్లాలో మొత్తం 396 పంచాయతీలున్నాయి. ఇప్పటికే 360 పంచాయతీల్లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులను ఫిబ్రవరిలో ప్రారంభించారు.
వంద రోజులు పని పూర్తి చేసిన వారికి పనులు ఇవ్వకుండా మిగిలిన వారికి పనులు ఇచ్చేలా పని డిమాండ్ పెడుతున్నారు. ఓ వైపు ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఉదయం 6 నుంచి 9.30 గంటల్లోపే పనులు చేపట్టాలని ప్రభుత్వం మౌఖికంగా ఆదేశించింది. ఉపాధిహామీ అధికారులు గ్రామాల్లో డప్పు చాటింపు ద్వారా కూలీలు పనులకు త్వరగా వెళ్లి రావాలని సూచిస్తున్నారు. అదే విధంగా పనులు జరిగిన చోట నీడ, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు.
కడెం, కుభీర్, కుంటాల, సారంగాపూర్ తదితర మండలాల్లో కూలీలు పెద్ద ఎత్తున ఉపాధిహామీ పనులకు వెళ్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు పూర్తిగా ముగియడంతో ఉపాధిహామీ పనులకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు కూడా కూలీల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పనుల వివరాలను ఫొటో సాయంతో కొత్త సాఫ్ట్వేర్లో నమోదు చేసి డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కూలీలు కూడా ఉపాధి పనులకు వెళ్లేందుకు పోటీ పడుతున్నారు.