భీంపూర్, ఏప్రిల్12: పోషకాహార లోపం పిల్లలు, గర్భిణులు, బాలింతలకు శాపంగా మారుతున్నదని, దీని నివారణకు ప్రభుత్వం సూచించిన విధంగా సమష్టి కృషి ,పర్యవేక్షణ ఆవశ్యకమని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పర్యవేక్షణతో కూడిన అనుబంధ ఆహారం- రక్తహీనత నివారణపై భీంపూర్ రైతువేదిక భవనంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 896 మంది పిల్లలు అతి తీవ్ర, 2264 మంది తీవ్ర పో షకాహార లోపంతో బాధపడుతున్నారని తెలిపారు. భీంపూర్ మండలంలో 32 మంది అతి తీవ్ర, 130 మంది పిల్లలు తీవ్ర పోషకాహార లోపంతో ఉన్నట్లు సర్వేలో వెల్లడైందని వివరించారు. ఈ జాబితాను తాము సంబంధిత పంచాయతీలకు అందజేస్తున్నామని చెప్పారు. దీనికి అనుగుణంగా సర్పంచ్లు, కార్యదర్శులు, అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. రెండు నెలల్లోగా రక్తహీనతను వంద శాతం నివారించాలని చెపాపరు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలామృతం అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ కేంద్రాల్లో ఎప్పటికప్పడు పిల్లల ఎదుగుదల, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై నిత్యం పర్యవేక్షణ చేస్తున్నాయని వివరించారు. సర్పంచ్లు, కార్యదర్శులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైతే 100 శాతం సేవలందుతాయని ఆకాంక్షించారు. తక్కువ బరువు ఉన్న పిల్లలను పీహెచ్సీ వైద్యుల సలహాతో ఆదిలాబాద్ రిమ్స్లోని న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించాలన్నారు. గిరిజనప్రాంతాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి గ్రామం ఓడీఎఫ్ కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఇటీవల రాష్ట్రస్థాయిలో అవార్డు పొందిన డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ను స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు సన్మానించారు.
కార్యక్రమంలో డీపీఆర్వో భీంకుమార్, ఐసీడీఎస్ పీడీ మిల్కా, వైద్యాధికారి డాక్టర్ విజయసారథి, జడ్పీటీసీ కుమ్ర సుధాకర్ , ఎంపీపీ కుడిమెత రత్నప్రభ, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, ప్రత్యేకాధికారి గోపీకృష్ణ ,తహసీల్దార్ మహేందర్, ఎస్ఐ రాధిక, ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్లు మడావి లింబాజీ, పెండెపు కృష్ణ యాదవ్, జీ భూమన్న, హనుమద్దాసు, కరీం,బాదర్, జహీర్ అహ్మద్, బక్కి అజయ్ యాదవ్, కేమ కల్యాణి, నాయకులు సంతోష్, జాదవ్ రవీందర్, ఉత్తం రాథోడ్, జీ నరేందర్ యాదవ్, బక్కి కపిల్యాదవ్, అంగన్వాడీ , ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు