కోటపల్లి/కౌటాల, ఏప్రిల్ 10 : ఈనెల 13 నుంచి 24 వరకు కొనసాగనున్న ప్రాణహిత పుష్కరాల ప్రారంభానికి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కోటపల్లి మండలం అర్జునగుట్ట ప్రాణహిత పుష్కరఘాట్కు రానున్నారు. 13న 3:50 నిమిషాలకు దేవగురు బృహస్పతి మీనరాశిలో ప్రవేశిస్తున్న సందర్భంగా ప్రాణహితకు పుష్కరాలు వస్తున్నాయి. ఈ సమయంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో పాటు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పుష్కరాలను ప్రారంభించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోటపల్లి మండలంలోని అర్జునగుట్టతోపాటు వేమనపల్లి మండల కేంద్రం సమీపంలో ప్రాణహిత వద్ద, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహట్టి వద్ద జరిగే పుష్కరాలకు భక్తులు రానున్నారు. అర్జునగుట్ట ప్రాణహిత పుష్కరఘాట్ జాతీయ రహదారి నంబర్ 63కి ఆనుకొని ఉండడం, మంచిర్యాల రైలు మార్గానికి అతి దగ్గరలో ఉండడంతో అర్జునగుట్ట పుష్కరఘాట్కు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది.
17న కేటీఆర్ వచ్చే అవకాశం..
ప్రాణహిత పుష్కరాలకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 17న మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట పుష్కరఘాట్కు రానున్నట్లు సమాచారం. గత పుష్కరాలకు సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత హాజరై పుణ్యస్నానాలు ఆచరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పుష్కరా లు రాగా వీరితోపాటు టీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్కరాలకు వచ్చే చాన్స్ ఉన్నప్పటికీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రైతులకు మద్దతుగా చేస్తున్న ఉద్యమంలో కేసీఆర్ బిజీగా ఉండడం వల్ల రాలేకపోతున్నాడని తెలుస్తున్నది. పుష్కరాలకు తెలంగాణ రాష్ట్రంలోని మెజార్టీ మంత్రులు అర్జునగుట్టకు రానున్నట్లు సమాచారం.
చకచకా ఏర్పాట్లు..
ప్రాణహిత పుష్కరాలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు తాగునీరు, నీడ, బట్టలు మార్చుకునేందుకు గదులు, మరుగుదొడ్ల నిర్మాణం, తాత్కాలిక రహదారుల నిర్మాణం, పార్కింగ్ సౌకర్యాల్లో నిమగ్నమయ్యారు. పుష్కరాల నిర్వహణ కోసం రూ.70 లక్షలు విడుదల అయినట్లు సమాచారం. నది లోపలికి వెళ్లి భక్తులు స్నానాలు అంచరించకుండా ఉండేందుకు ఇరిగేషన్ అధికారులు రక్షణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇదే విధంగా కౌటాల మండలంలోని తుమ్మిడిహట్టి వద్ద కూడా పుష్కరఘాట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆదివారం పనులను ఎంపీవో శ్రీధర్ రాజు పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్ చరణ్దాస్, కార్యదర్శి వైకుంఠం, తదితరులున్నారు.