బేల, ఏప్రిల్ 6 : పిల్లలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధికారులకు ఆదేశించారు. మండల కేంద్రంలోని పద్మావతి మండల సమాఖ్య సమావేశ మందిరంలో జిల్లా వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అనుబంధ పోషకాహార అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలు , గర్భిణులను గుర్తించి పౌష్టికాహారం అందించాలని సూచించారు. జిల్లాలో రక్తహీనతతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నదని , సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ సిబ్బంది , ఏఎన్ఎంల నేతృత్వంలో ప్రతి గ్రామంలో పోషకాహార దినోత్సవం నిర్వహించాలని ఆదేశించారు. వయసుకు తగిన ఎత్తు, బరువు లేని పిల్లలు, రక్త హీనతతో బాధ పడుతున్న గర్భిణులు, బాలింతలను గుర్తించి ప్రత్యేక వైద్య చికిత్సతో పాటు బాలామృతాన్ని అందించాలని చెప్పారు.
పాఠశాలల్లో 12 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలకు ప్రతి గురువారం ఐరన్ మాత్రలు అందించాలని సూచించారు. గ్రామాల్లో మహిళలు వ్యక్తిగత శుభ్రతతో పాటు మరుగుదొడ్లను వినియోగించేలా ఆధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు మండలంలో రెగ్యులర్ డాక్టర్ లేక పోవడంతో వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అత్యవసర సమయంలో 108 వాహనం కూడా ఉండడం లేదని సర్పంచ్లు ఆడె శంకర్ , వట్టిపెళ్లి ఇంద్రశేఖర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
త్వరలోనే రెగ్యులర్ డాక్టర్ను నియమిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఆర్డీవో కిషన్, మండల ప్రత్యేకాధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ఏపీడీ రవీందర్ రాథోడ్, జిల్లా అనీమియా నియంత్రణ ఆధికారి పవన్కుమార్, ఎంపీపీ వనిత ఠాక్రే, ఎంపీడీవో భగత్ రవీందర్, తహసీల్దార్ బడాల రాంరెడ్డి, ఐకేపీ ఇన్చార్జి ఏపీఎం శరత్రెడ్డి, సర్పంచ్లు విఫిన్ ఖోడే, దౌలత్ పటేల్, ఎంపీటీసీలు, ఆయ శాఖల ఆధికారులు, ఐకేపీ సిబ్బంది, కార్యదర్శులు, ఏఎన్ఎంలు, పీహెచ్సీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.