తాండూర్, మార్చి 4 : తాండూర్ మండలం మాదారం టౌన్షిన్కు చెందిన వైద్య విద్యార్థిని స్ఫూర్తి ఉక్రెయిన్ నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఇంటికి క్షేమంగా చేరుకున్నారు. స్ఫూర్తి రాక కోసం పది రోజులుగా ఎదురు చూస్తున్న తల్లిందండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్ఫూర్తి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ ఉక్రెయిన్లో జఫ్రోజీ యూనివర్సిటీలో తనతో పాటు 1500 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. అందులో దాదాపు 800 మంది తెలుగు వాళ్లేనని తెలిపింది. యుద్ధం వార్తలు రాగానే అక్కడి నుంచి రావాలని అనుకున్నాం. రష్యా బలగాలు వెనక్కి తగ్గడంతో ఆగిపోయాం. మళ్లీ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఫిబ్రవరి 27కు ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసుకున్నాం. నో ఫ్లైట్ జోన్గా ప్రకటించడంతో అక్కడే చిక్కుకుపోయాం. ముందుగా ఆహార పదార్థాలు, వంట సామగ్రి తెచ్చుకున్నాం.
సూపర్ మార్కెట్లో వస్తువుల కొరత ఏర్పడింది. ఉక్రెయిన్ ప్రభుత్వం, భారత ఎంబసీ సహకారంతో హంగేరీకి రైలు సౌకర్యం ఏర్పాటు చేశారు. మా కాలేజీ యాజమాన్యం వారు కూడా వెంట వచ్చారు. ఓ వైపు మంచు పడుతుండడం, మరో వైపు యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో చాలా నెమ్మదిగా ప్రయాణం సాగింది. అక్కడి నుంచి ఎంబసీ అధికారులు దగ్గర ఉండి మాకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. హంగేరీ నుంచి ఢిల్లీలో తెలంగాణ భవన్కు అక్కడి నుంచి హైదరాబాద్ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. నేను ఇక్కడకు రావడానికి టీఆర్ఎస్ పార్లమెంటరీ ఫ్లోర్లీడర్ నామా నాగేశ్వర్ రావు సహకారం మరువలేనిది. మంత్రి కేటీఆర్ సర్ కూడా అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందించారు. వారి మేలు జన్మలో మరిచిపోలేం. చాలా మంది విద్యార్థులు అక్కడ ఆకలితో ఆలమటిస్తున్నారని వారిని సైతం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని కోరారు.